తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవడానికి తెగ ఉత్సాహ పడుతున్నారట.రాష్ట్రంలో తనయుడు కెటిఆర్కు పట్టాభిషేకం చేసి తాను హస్తినలో చక్రం తిప్పాలని ఆయన ఆరాటపడుతున్నారట.
తాజాగా కేసీఆర్ అసెంబ్లీ లో చేసిన ప్రసంగం ఈ ఊహాగానాలను నిజమే అనేలా ఉంది.నిజానికి గత ఎన్నికల ముందు నుంచి కేసీఆర్ గళం లో చాలా మార్పు కనిపించింది. జాతీయ సమస్యలపై ఆయన ప్రధానంగా ప్రస్తావించడమే కాదు కాంగ్రెస్, బిజెపి లేని రాజకీయాలను దేశ వాసులు కోరుకుంటున్నారని ప్రచారం మొదలు పెట్టారు. అంతే కాదు కాలికి బలపం కట్టుకుని కలిసొచ్చే వారిని కలుపుకు వెళ్లేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. అయితే అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్నట్లు ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి నేరుగా వచ్చేసింది. అంతేగాదు తెలంగాణలో బిజెపి నాలుగు లోక్సభ స్థానాలను కూడా గెలుచుకుంది .ముఖ్యమంత్రి కెసిఆర్ ముద్దుల కుమార్తె కవిత సైతం నిజామాబాద్లో బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయింది.
తెలంగాణలో ప్రస్తుతం కెసిఆర్కు ప్రధాన ప్రతిపక్షమంటే బిజెపి కనిపిస్తోంది.ఈ సమీకరణాలన్ని కలగలుపుకున్న కెసిఆర్ ఇక తాను జాతీయ రాజకీయాలలోకి వెళితేనే బాగుంటుందన్న నిర్ణయానికొచ్చారట.దీంతో ఆయన మళ్లీ తన పాత అస్త్రాల్ని బయటకు తీస్తున్నారు తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ నీళ్లు, నిధులు నియామకాలు అంటూ ఉద్యమించారు. దీన్ని తెలంగాణ సమాజం ఆమోదించి రెండోసారి కూడా కారు పార్టీకే జై కొట్టింది. అదే వ్యూహంతో ఇప్పుడు జాతీయ రాజకీయ అరంగేట్రం కోసం గులాబీ బాస్ ముందుకు వెళుతున్నట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 78 వేల టి ఎం సి ల నీరు అందుబాటులో ఉంటే అందులో సగం కూడా వినియోగించుకోలేక పోతున్నామంటూ అసెంబ్లీలో కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అదే విధంగా విద్యుత్ అంశం లోను కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీలు దేశ ప్రజలకు చీకట్లు చూపిస్తున్నాయంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. మన దేశ అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నా చాలా రాష్ట్రాల్లో చీకట్లో మగ్గుతున్నాయని దీనికి పాలకుల తీరే కారణమంటూ కేసీఆర్ ఉతికేశారు. ఇలా గత ఎన్నికల ముందు కేసీఆర్ ఏ అంశాలైతే ఎత్తుకున్నారో వాటిని ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో ఆయనతెరపైకి తీసుకురావడం చర్చనీయం అయ్యింది.
చాలా రోజులుగా కేసీఆర్ కుమారుడు కెటీఆర్ కి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించి జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులు వేస్తారనే అంతా లెక్కలు కట్టారు. అందరు భావిస్తున్నట్లే కేటీఆర్ సైతం అటు ప్రభుత్వం లో అన్ని తానై ఇటు పార్టీలోనూ తానె కేంద్ర బిందువుగా దూసుకుపోతున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటినుంచి గులాబీ బాస్ వ్యూహం వేస్తున్నారని అందుకే జాతీయ అంశాలపై కేసీఆర్ ఫోకస్ పెంచారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .తలచుకుంటే ఏదైనా చేయగల సామర్థ్యం ఉన్న కెసిఆర్ తప్పటడుగులు వేయరన్న విశ్లేషణ కూడా ఉంది .