ఇటీవల ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తో జరిగిన అఖిలపక్ష వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో దేశంలో ఉన్న ప్రధాన పార్టీల నేతలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా భారత్ మరియు చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు విడిచిన సైనికులకు మోడీ నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తన అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా తనదైన శైలిలో తెలియజేశారు. ఇండియా మరియు చైనా సరిహద్దుల్లో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా అండగా ఉంటామని కెసిఆర్ స్పష్టం చేశారు.
చైనాతో సరిహద్దుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తొందర పడకుండా, దేశ ప్రయోజనాల విషయంలో వెనుకంజ వేయకుండా, తల వంచకుండా పోరాడాలని పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తిగా కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో రాజనీతి కాదని యుద్ధనీతి అవసరమని తెలిపారు. ఇదే సమయంలో అందరూ చైనా వస్తువులు ఆపేయాలని అంటున్నారు, ఒకేసారి అలా చేస్తే మనమే నష్ట పోతామని కేంద్రానికి తెలిపారు.
ఈ తరుణంలో దిగుమతి తక్కువ చేస్తూ వాటికి సంబంధించిన తయారీ రంగాన్ని మన దేశంలోనే తయారు అయ్యేలా కేంద్రం సహకరించాలని, తక్కువ ధరకే లభించే లాగా దేశంలో వస్తు తయారీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా రక్షణ వ్యవహారాల్లో మిగతా దేశాలతో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకొచ్చారు. మరోపక్క ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ మనదేశంలోనే ఉందని అంతర్జాతీయ లెక్కలు చెబుతున్నాయి ఇందువల్లే పెట్టుబడులు మన దేశం లోకి వస్తున్నాయి. ఇది చైనా కి నచ్చటం లేదని కెసిఆర్ అన్నారు. కానీ ఈ విషయంలో కేంద్రానికి అన్ని విధాల మద్దతు ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా కేసీఆర్ అంతర్జాతీయ స్థాయిలో దేశంలో ఉన్న మార్కెట్ విషయంలో, వస్తు తయారీ విషయంలో స్ట్రాంగ్ పాయింట్ కేంద్రానికి చెప్పారని పరిశీలకులు అంటున్నారు. చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కల్లా కరోనా వైరస్ ని ఎదుర్కొన్నది భారత్ కాబట్టి..చైనాతో వ్యూహాత్మకంగా కెసిఆర్ చెప్పినట్టు డీల్ చేస్తే ఖచ్చితంగా భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా అవతరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.