ఆపత్కాలంలోనే నాయకుడి, పాలకుడి దక్షత తెలిసి వస్తుంది అంటారు. కరోనా కాలం కూడా అటువంటిదే. దేశాన మోడీకి, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు పరీక్ష పెట్టింది. తొలినాళ్లలో బాగా పోరాడి అదుపు చేసి, గెలిచిన నాయకులు కాలం గడిచే కొద్దీ ఓడారు. తొలినాళ్లలో తేలిగ్గా తీసుకుని ఓడే దశకు చేరుకున్న వారు.., తర్వాత దశలో తేరుకుని కొంత బాగా పని చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కేసీఆర్ ఈ విషయంలో గెలిచి ఓడారు. అదేంటో చూద్దాం పదండి.
మార్చి 22 ఒక ప్రెస్ మీట్, మార్చి 29 ఒక ప్రెస్ మీట్, ఏప్రిల్ 5 మరో ప్రెస్ మీట్, ఏప్రిల్ 13 ఒక ప్రెస్ మీట్…. ఇలా కేసీఆర్ కరోనాపై యుద్ధం ప్రకటించినట్టుగా విపరీత హడావిడి చేశారు. పదే పదే ప్రెస్ మీట్లు పెడుతూ తాను, తమ ప్రభుత్వం కరోనాని ఎంత సీరియస్ గా తీసుకుందో పరోక్షంగా తెలియజేసారు. ఒకరకంగా తెలంగాణ వాసులకు కేసీఆర్ పై భరోసా ఏర్పడింది. “మా ముఖ్యమంత్రి చాలా చక్కగా పని చేస్తున్నారు. కరోనా విషయంలో చాలా ప్లానింగ్ గా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చారు. మే 2 న ప్రెస్ మీట్ పెట్టి… ఇప్పుడు 40 కేసులు మాత్రమే ఉన్నాయి ఇవి క్యూర్ అయితే ఇక తెలంగాణలో కరోనా లేనట్టే అంటూ చెప్పుకొచ్చారు. అంతే ఇక సంబరాలు. అక్కడితే సీన్ కట్ చేస్తే…!
కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణలో కేసులు తగ్గలేదు. కానీ పరీక్షలు తగ్గాయి. ఫలితంగా నిజంగా కరోనా వెళ్లిపోయిందా? నిజంగా కరోనాని తెలంగాణ జయించేసిందా…? అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ లోతుగా ఒక పెద్ద తంతు మొదలయ్యింది కాస్త ఆలస్యంగా ఒక సీక్రెట్ బయటకు వచ్చింది. ఏమిటంటే… కరోనా పరీక్షలు చేయడం లేదు. తెలంగాణలో రోజుకి 500 పరీక్షలు కూడా చేయట్లేదు అందుకే కరోనా కేసులు బయటపడట్లేదు అంటూ విపరీత ప్రచారం జరిగింది. హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని కడిగేసింది. అదే సమయంలో ఏపీలో కరోనా పరీక్షలు పెరిగాయి. ఎక్కువ కేసులు బయటపడడం ఆరంభమైంది. దీంతో కేసీఆర్ పై ముప్పేట దాడి మొదలయ్యింది. సాధారణంగా ఇటువంటి విమర్శలు పట్టించుకోని కేసీఆర్.. కోర్టులు, ప్రతిపక్షాలు, ఒక్క రాష్ట్ర ఫలితాలు అన్ని చూసి… ఇప్పుడు కరోనా పరీక్షలు పెంచారు. ఇప్పుడు మొదలయ్యింది తెలంగాణకి అసలైన సవాలు.
చివరగా గడిచిన 10 రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు భయానకంగా ఉన్నాయి. చేస్తున్న పరీక్షల్లో 25 % పాజిటివ్స్ వస్తున్నాయి. దేశంలో అత్యధికంగా నమోదు ఉంది. రోజుకి సగటున 3500 పరీక్షలు చేస్తుంటే వాటిలో 800 పాజిటివ్స్ వస్తున్నాయి. ఇంత దారుణ పరిస్థితి కేసీఆరు ముందు ఊహించి ఉండరుమ్ అందుకే లైట్ తీసుకున్నారు. జయించేసామన్నారు. ఇప్పుడు విజృంభనతో కేసీఆర్ పై అన్ని వైపులా నుండి ఒత్తిళ్లు పెరిగాయి. ఒక ఓదార్పు గా గచ్చిబౌలిలో ఒక ఆసుపత్రి వచ్చింది. అందుకే… కేసీఆర్ గెలిచినట్టా…? ఓడినట్టా..?