తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని కేసీఆర్ కొనియాడారు. అయితే, ఆ లేఖపై కొత్త చర్చ జరుగుతోంది.
ఏంటీ సెంట్రల్ విస్టా?
దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం తలపెట్టిన ప్రాజెక్ట్ పేరే ‘సెంట్రల్ విస్టా’. దీని వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం గుజరాత్కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది. ఈ ప్లాన్లో ఒక కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్పథ్ను పునరుద్ధరించడం ఉంది. కొత్త పార్లమెంట్ భవనంలో భారత ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రదర్శించేలా ఒక భారీ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, ఒక లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్లేసులు ఉంటాయి.
కేసీఆర్ ఏమంటున్నారు?
ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేదని, అలాగే అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్ఠకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి’’ అని కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా, రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడం ద్వారా మోడీజీకి కోపం వచ్చేలా చేసిన కేసీఆర్ ఆ మరుసటి రోజే ఈ లేఖ రాశారా అంటూ సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు.