అటు దుబ్బాక ఓటమి ఇటు గ్రేటర్లో సొంతంగా మేయర్ను కైవసం చేసుకోలేని స్థాయిలో బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
త్వరలో జరిగే ఎన్నికల విషయంలోనూ ఇదే రీతిలో బీజేపీ తమకు గట్టిపోటీ ఇచ్చే చాన్స్ ఇవ్వకుండా గులాబీ దళపతి ఇప్పటి నుంచే తన ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్ బై ఎలక్షన్ లో దుబ్బాక తరహా ఫలితం రాకుండా ఉండేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరాల జల్లు మొదలు పెట్టారని అంటున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో త్వరలో నాగార్జునసాగర్ బై ఎలక్షన్ జరుగనుంది. అక్కడ నోముల కుటుంబానికి టికెట్ ఇస్తే సానుభూతి పనిచేస్తుందా అనే కోణంలో టీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు.
హామీల జల్లు మొదలు…
నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. త్వరలోనే డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇంతేకాకుండా , మూసీ నదిపై కేశావపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాని నిర్మాణానికి 75.93 కోట్లు కేటాయించింది.
దుబ్బాక భయమేనా?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఏర్పడ్డ దుబ్బాక బై ఎలక్షన్ లో సానుభూతితో విజయం సాధించవచ్చన్న వ్యూహంతో ఆయన భార్యకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కానీ సానుభూతి పనిచేయలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్లో కూడా తేడా రావొద్దనే ఉద్దేశంతోనే ఇలా వరాల జల్లు మొదలుపెట్టిందని పలువురు అంటున్నారు.