టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎత్తులు పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిది అనూహ్యంగా దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది.
అత్యల్ప ఓట్లతో కారు పార్టీ చతికిలపడటం చర్చనీయాంశంగా మారింది. కారును పోలిన ఓ గుర్తు ఉండటం వల్లే ఈ రకంగా జరిగిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ,ఎమ్మెల్యే లక్ష్మ రెడ్డి,ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి భేటి అయి పలు ఎన్నికల గుర్తులపై పిర్యాదు చేశారు.
ఆ గుర్తులతో….
అనంతరం మాజీ మంత్రి , ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కారు గుర్తును పోలిన గుర్తులు అనేకం ఉన్నాయని, వాటిని తొలగించాలని ఎస్ఈసి ని కలిశామని తెలిపారు. “మొన్నటి ఉప ఎన్నికల్లో కారును పోలిన రోటీ మేకర్ గుర్తు వలన మా అభ్యర్థి ఓడిపోయారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇలాంటి గుర్తులతో భువనగిరి ఎంపీ అభ్యర్థి ఓడిపోయారు. గతంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి పిర్యాదు చేశాము. గుర్తులను పోలిన గుర్తులను తొలగింపు విషయంలో ఎస్ ఈ సి సానుకూలంగా స్పందించింది.“ అని తెలిపారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో….
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ రోటీ మేకర్ గుర్తు వలన టీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేశామని వెల్లడించారు. “కారు గుర్తును పోలిన ఇతర ఎన్నికల గుర్తు వల్ల ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలుగుతోంది. కొన్ని గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తో సీఈఓ ,రాష్ట్ర ఎన్నికల సంఘం కు పిర్యాదు చేశాం
ప్రతి సారి ఈ గుర్తులు ఓటర్లను గందరగోళం గురి చేస్తున్నాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా అలాంటి గుర్తులను తొలగించాలని పిర్యాదు చేశాం . జిహెచ్ఎంసి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని మా పార్టీ తరుపున కోరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండో సారి విశ్వనగరంలో జరిగే ఎన్నికలను శాంతియుత వాతావరణం లో జరపాలి అని చెప్పాము.“ అని వెల్లడించారు.