గత కొద్దిరోజులుగా తెలంగాణలో హాట్ హాట్ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
అధికార పార్టీని విపక్షాలు టార్గెట్ చేయడం, ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తుండటం జరుగుతోంది. అయితే, ఈ క్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటుగా తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీని సైతం ఆదిలోనే బుక్ చేసేయాలని గులాబీ దళపతి కేసీఆర్ భావిస్తున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రచ్చ రచ్చ…
హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య అసెంబ్లీ వేదికగా హాట్ హాట్ చర్చ జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ ఇచ్చి మళ్లీ ఎన్నికలు వస్తున్నందునే ఇళ్లను పంపిణీ చేస్తామని అంటున్నారు అని మండిపడ్డారు. `హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? ఎంత మందికి ఇచ్చారు?` అని ఆయన ప్రశ్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో స్వయంగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనను తీసుకెళ్లి డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలను చూపిస్తానని ప్రకటించారు. లక్ష ఇళ్లను చూపిస్తానంటే రావడానికి తాను సిద్ధమేనన్నారు భట్టి. దీంతో హైదరాబాద్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను చూపించేందుకు భట్టి ఇంటికి మంత్రి తలసాని వెళ్లారు. ఆయనతో తీసుకొని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ఇక్కడే అసలు ట్విస్ట్
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు చూపించిన అనంతరం మచంద్రాపురం కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొల్లూరు లో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళా ఖండమని అన్నారు. 18 నెలల్లోనే కొల్లూరులో సకల వసతులతో 15 వేల పైగా ఇండ్లు కట్టామని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుడా హైద్రాబాద్ నిరుపేదల కోసం 15 శివారు ప్రాంతాల్లో 33, 550 ఇండ్లు నిర్మాణం చేశారని అన్నారు. నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 10 శాతం, హైదరాబాద్ వారికి 90 శాతం మందికి కేటాయిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం బాధ్యత గా నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ నిర్మాణలు చూపెడుతామని చెప్పిన వినలేదని చెప్పుకొచ్చారు.
మోదీని ఇరికించి…
ఇలా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో బీజేపీపై సైతం మంత్రి తలసాని విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో తాము నిర్మిచిన లక్ష ఇళ్ల జాబితా కాంగ్రెస్ పార్టీకి కి పంపిస్తామని ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకే కాదు… ప్రధానికి కూడా సవాల్ విసురుతున్నా ఇక్కడి మాదిరిగా ఎక్కడైనా ఇండ్లు పేదలకు కట్టారా ? అని ఆయన ప్రశ్నించారు. సీఎల్పీ నేత కాంగ్రెస్ పార్టీ గురించి స్పందిస్తూ మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పేర్కొనడం వెనుక కారణం బీజేపీ సైతం ఇరకాటంలో పడేయడమని పలువురు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ కూడా విమర్శలు చేయకుండా ఇప్పటి నుంచే టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోందని చెప్తున్నారు.