తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తోంది. 
ఈ మేరకు పార్టీ పేరుతో సహా వార్తలు వస్తున్నాయి. దీన్ని కేసీఆర్ ఖండించినట్లు సమాచారం. అయితే, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేసేలా గులాబీ దళపతి నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్రంతో యుద్ధమే…
అనంతరం పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవరావు ,లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామానాగేశ్వర్ రావు తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.కేశవ రావు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణ ప్రతిపాదనను పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. రాజ్యాంగబద్దంగా తెలంగాణ కు రావాల్సిన నిధులు ,హామీలు నెరవేర్చడం లేదని వెల్లడించారు. కేంద్రంతో ఇక పార్లమెంట్ లో పోరాటమేనని ప్రకటించిన కేశవరావు దాన్ని యుద్ధం అని అనుకున్నా అభ్యంతరం లేదని ప్రకటించారు.
ఇవన్నీ ఏంటి?
కృష్ణ నదీ జలాల వివాదాన్ని కేంద్రం తేల్చడం లేదని కేశవరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. “తెలంగాణ లో సాగు విస్తీర్ణం 24 శాతానికి పైగా పెరిగినా దానికి తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదు. కేంద్రం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టంను వ్యతిరేకిస్తున్నాం. ఆ చట్టం తో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది …ఇక్కడి బీజేపీ నేతలు ఆ చట్టాన్ని సమర్థిస్తారా? జాతీయ రహదారుల విస్తరణ పై కేంద్రం మాట తప్పింది. కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి …ఇంత మోసపూరిత సర్కారును చూడలేదు. తెలంగాణకు 22 నవోదయ స్కూళ్ళు రావాలి. అయినా కేంద్రం స్పందించడం లేదు“ అని మండిపడ్డారు.
ఎందుకు ఇలా చేస్తున్నారు?
జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోందని కేశవరావు మండిపడ్డారు. “రావాల్సిన పది వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఇంకా ఇవ్వట్లేదు. వరంగల్లో టెక్సటైల్ పార్కు కు నయాపైసా ఇవ్వడం లేదు. ఎయిర్ స్ట్రిప్ లను కూడా కేంద్రం ప్రకటించడం లేదు. పార్లమెంటులో ఇక కేంద్రంతో బిగ్ ఫైట్స్ ఉంటాయి. సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తాం. రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ పోస్టును రాజకీయాలకు లాగడం సరికాదు“ అని పేర్కొన్నారు.
వదిలిపెట్టే ప్రసక్తే లేదు
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంటు లో మేము జరిపే పోరాటానికి ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిసి వస్తారో, రారో తేల్చుకోవాలని అన్నారు. `తెలంగాణలో కాదు వారు ఢిల్లీలో మాట్లాడాలి. సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా సమస్యలపై కేంద్రానికి ఉత్తరాలు రాసి అలసిపోయారు …ఇక కేంద్రాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు“ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశౄరు. “విద్యుత్ చట్టం తో రైతుల వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు పెట్టాలని చూస్తూన్నారు. ఈ విధానాన్ని బీజేపీ ఎంపీలు ఎలా సమర్దిస్తారు? కనీసం నవోదయ స్కూళ్ళు సాధించని అసమర్ధులు బీజేపీ ఎంపీలు. జీఎస్టీ చట్టంతో తెలంగాణ వేల కోట్లు నష్టపోయింది. కరోనా పేరుతో జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని చూస్తోంది. జాతీయ రహదారుల విషయంలో కనీసం గుంతలు పూడ్చడం లేదు. పార్లమెంటులో ప్రశ్నోత్తారాలు తొలగించడాన్ని ఖండిస్తున్నాం. పార్లమెంటు లోపల, బయట కలిసి వచ్చే పార్టీలతో కలిసి ధర్నా చేస్తాం“ అని ప్రకటించారు.