Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఆయన అదృశ్యం కావడానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. కాగా.. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు పుట్ట మధు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. అయితే ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం.. ఆ తర్వాత ఆయన ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ప్రెస్మీట్ పెట్టినప్పటినుంచి పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లాడు.
కాగా.. ఈటల వ్యవహారం బయటకు రావడంతోనే మధుకు చెక్ పెట్టారని స్థానికులంతా భావిస్తున్నారు. ఈటల మీద వేటుపడిన తర్వాత.. క్రమక్రమంగా ఆయన అనుచరుల మీద కూడా ప్రభుత్వం కన్నేసినట్లు అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టా మధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈటల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకే మధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తున్న ఎపిసోడ్!
అయితే గత వారం రోజుల నుంచి మధు.. చత్తీస్ఘర్లో ఉంటున్న తన కూతురి దగ్గర ఉన్నారని వార్తలొచ్చాయి. అదే తరుణంలో ఆయన భార్య అయిన మున్సిపల్ చైర్మన్ శైలజ.. పుట్ట మధు ఆచూకీ తెలుసుకోవాలని కోరుతూ కొంతమంది మంత్రులను కలిసి వచ్చారని తెలుస్తోంది. దాంతో పుట్టా మధు అజ్ఞాతం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత శుక్రవారం మధు భార్య శైలజ ప్రెస్మీట్ పెట్టి.. మధుకు కరోనా లక్షణాలున్నాయని, అందుకే ఆయన ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. ఆ మరుసటి రోజే మధు తమ అదుపులో ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రెస్నోట్ విడుదల చేశారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు మధు రెండు లేదా మూడు రోజులనుంచి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదంతా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది.
అన్నీ చెప్పేశాడన్న పోలీసులు!
మంథని లాయర్ దంపతుల హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్టా మధు ఎట్టకేలకు నోరు విప్పాడు. గత 10 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు, ఎవరెవరిని కలిశాడు అనే వాటన్నింటికి సమాధానం చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.