తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుండి వైయస్ జగన్ విషయంలో చాలా సానుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో చాలా విషయాలకు సంబంధించి ఏపీ తో కేసీఆర్ విభేదించడం జరిగింది. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మరింతగా కేసిఆర్ సన్నిహితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎక్కడా కూడా జగన్ కి మరియు కేసీఆర్ కి మధ్య విభేదాలు వచ్చిన సందర్భాలు లేవు. జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన టైంలో కూడా కేసిఆర్ ఎలాంటి సమస్యలు అయినా కర్కశంతో కాకుండా కరచాలనంతో పరిష్కరించే రీతిలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెయింటెన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
చాలా వరకు కేసిఆర్ జగన్ ప్రాణ స్నేహితులు అంటూ ప్రత్యర్థులు కూడా వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల అధికార నేతల్లో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఇటీవల వ్యవసాయ విద్యుత్ విషయంలో జగన్ నాలుగు వేల కోట్లకు కేంద్రం వద్ద తల దించారని… ఈ విద్యుత్ విధానం రైతులకు ఉరి వేయటమే అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు విషయంలో హరీష్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కూడా కౌంటర్లు ఇవ్వడం జరిగింది.
దీంతో వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఈ విషయంలో కేసీఆర్ ఏం చేయాలో ఎలా ప్రతిస్పందించాలి పాలుపోక ప్రాణ స్నేహితుడైన జగన్ నీ వదులుకోలేక అటూ మేనల్లుడు హరీష్ ను సముదాయించలేక మధ్యలో నలిగిపోతున్నట్లు తెలుగు రాజకీయాల్లో టాక్ వినపడుతోంది. ముఖ్యంగా కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో… జగన్ మోడీకి అనుకూలంగా ఉండటంతో టిఆర్ఎస్ పార్టీ నేతలు అసహనం చెందుతున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.
అయితే కేంద్రం వద్ద జగన్ తలదించటం అనే వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా లేకుండా వివాదాలతో ముందుకెళ్లే మంటారా అంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే డబ్బులు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళావని ప్రజల వద్దకే వెళ్తాయని స్పష్టం చేశారు. ఏది ఏమైనా హరీష్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పెను దుమారంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.