KCR : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు తన పార్టీ నేతలకు తీపి కబురు చెప్పనున్నారా? ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన కసరత్తు మొదలుపెట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఓ వైపు ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగుతుండగానే మరోవైపు శాసనమండలిలో ఈ ఏడాది ఖాళీ అవుతున్న ఏడు స్థానాలపై చర్చ మొదలైంది. అప్పుడే ఆశావహుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
ఇవే ఖాళీలు…
ఈ ఏడాదిలో శాసనమండలిలో మొత్తం ఏడు ఖాళీలు ఏర్పడనున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్ 3న, గవర్నర్కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కరి పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 16న ముగియనుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలితతో పాటు గవర్నర్ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ముగుస్తోంది. దీంతో అప్పుడే ఈ సీట్లపై నేతల చూపు పడింది.
అప్పుడే ప్రయత్నాలు మొదలు…
త్వరలోనే సీట్లు ఖాళీ అవుతుండటం .. ముందు నుంచే ప్రయత్నాలు చేసుకుంటే బెర్తు ఖరారయ్యే చాన్సు ఉండటంతో నేతలంతా పార్టీ రథసారథిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పదవిలో ఉన్న వారే కాకుండా సీనియర్లు , గతంలో తృటిలో చాన్స్ మిస్సయిన వారు సైతం మళ్లీ అవకాశం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే ప్రతిపాదనలు పెడుతున్నట్లు తెలుస్తోంది.