మహానటి సినిమా తర్వాత ఎక్కువగా కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్రమంలోనే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాలని కమిటయింది. ఈ సినిమాలలో ఇప్పటికే పెంగ్విన్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీర్తి నటించిన మరో సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుడ్ లక్ సఖి సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారు.
కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి అన్న టైటిల్ తెరకెక్కిన ఈ సినిమాకి ఎక్కువమంది లేడీ టెక్నీషియన్స్ పని చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాకి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి నిర్మిస్తున్నారు.
అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 న ఉదయం 10 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక ఈ సినిమా లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అలాగే కీర్తి సురేష్ నటిస్తున్న మిస్ ఇండియా సినిమాని త్వరలో రిలీజ్ చేస్తారని సమాచారం.