(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏసీబీ కేసులో అండర్ ట్రైల్ ఖైదీగా చంచల్గూడ జైలులో ఉన్న కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు నేడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో కోటి పది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి ఆయన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఏసీబీ అధికారుల సోదాలో పెద్ద మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించడంతో నాగరాజును అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. జైలులో ఈ తెల్లవారుజామున నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కీసర తహశీల్దార్గా పని చేస్తూ.. భూ వివాదాన్ని పరిష్కరించేందుకు కోటి పది లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబీ అధికారులు రెడ్ హాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు విఆర్ఒ సాయి రాజ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అవినీతి కేసులో అరెస్టు అవ్వడంతో ప్రభుత్వం నాగరాజును సస్పెండ్ చేసింది. ఏసీబీ అధికారుల విచారణలో ఉప్పల్లోని శ్రీచౌలా శ్రీనాధ్ యాదవ్, శ్రీ సత్య డెవలపర్ల నుండి రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కూడా వెల్లడైంది.