కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇచ్చిన ఆదేశాలపై తొమ్మిది యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీసీల తరపు న్యాయవాదులు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరడంతో దీపావళి పండుగ సెలవు దినం అయినప్పటికీ హైకోర్టు ఈ అంశంపై ప్రత్యేకంగా ఈ సాయంత్రం విచారణ జరిపింది. సోమవారం (ఈరోజు) 11.30 గంటలకల్లా రాజీనామాలు సమర్పించాలంటూ నిన్న ఇచ్చిన ఆదేశాలపై వైస్ చాన్సలర్ లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్వల్ప ఊరట నిస్తూ ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తుది ఆదేశాలు జారీ చేసే వరకూ వీరు పదవుల్లో కొనసాగవచ్చునని హైకోర్టు తెలిపింది.
వైస్ ఛాన్సలర్ లు హైకోర్టు ను ఆశ్రయించిన తర్వాత గవర్నర్ మరొక నోటీసును జారీ చేశారు. విశ్వ విద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లుగా కొనసాగించేందుకు గల చట్టబద్దమైన హక్కును వివరిస్తూ నవంబర్ 3వ తేదీ సాయంత్రం అయిదు గంటల ల్లోగా సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు. సమాధానాలు ఇవ్వడంలో విపలమైతే, ఈ నియామకాలు చెల్లనివిగా, చట్టవిరుద్దమైనవిగా పరిగణిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ (కులపతి) గా గవర్నర్ వ్యవహరిస్తారని, వైస్ ఛాన్సలర్ (ఉప కులపతుల) లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సందర్బంగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్దంగా ఈ నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. సక్రమంగా నియామకాలు జరిపేందుకు వీలుగా పదవులకు రాజీనామా చేయాలని వీసీలను కోరారు.
కేరళ సర్కార్ నియమించిన తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లకు తొలగించేందుకు గవర్నర్ నోటీసులు జారీ చేయడంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో యుద్దం ప్రకటించారని ఆరోపించారు. సంఘ్ పరివార్ నాయకుడిగా ఆయన (గవర్నర్) వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఇటీవల గవర్నర్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మద్యం, లాటరీ టికెట్ల వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూసుకుంటుందని ఆక్షేపణ వ్యక్తం చేశారు.