ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి గానూ కేందర ప్రభుత్వం నేడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఈ కీలక సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించనున్నారు. ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాల విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా చాలా వరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి విభజన సమస్యలను కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న సమస్యల పై చర్చించేందుకు కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హజరు కానున్నారు. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హజరు కానున్నారు.
విభజన చట్టంలోని షెడ్యుల్ 9 కింద ప్రభుత్వ కార్పోరేషన్లతో పాటు కంపెనీల విభజన, షెడ్యుల్ పది లోని సింగరేణి కాలరీస్ విభజన, బ్యాంకు నగదు నిల్వల విభజన వంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. విభజన హామీల అమలుతో పాటు వెనుకబడిన జిల్లాలలకు ప్రత్యేక నిధుల కేటాయింపు తదితర అంశాలపై సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.