(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
జాతీయ కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధికి రాజీనామా చేసిన తమిళనాడుకు చెందిన సినీ నటి కుష్బూ సుందర్ నేడు బీజెపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని బీజెపీ జాతీయ కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న సందర్భంగా ఆమెకు రసీదును అందజేశారు. తొలుత సీనియర్ నేతలు కుష్భూకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
తమిళనాట ఎన్నికల వేళ కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత సోనియా గాంధీకి పంపారు. పార్టీ కోసం పని చేస్తున్న తన లాంటి వారిని ప్రజలతో సంబంధం లేని వారు అణచివేస్తున్నారని సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో డీఎంకెలో పని చేసిన కుష్బూ 2014 లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఆమె ప్రశంసించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ గాంధీ కూడా తప్పుబట్టారు. అప్పటి నుండి కుష్భూ.. పార్టీకి దూరంగా ఉంటుండటంతో బీజేపీలో చేరనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే కుష్భూ ఆ వార్తలను ఖండించారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ పంపిన కుష్భూ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజెపీ సభ్యత్వం తీసుకున్న తరువాత కుష్బూ బిజెపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా కుష్బూ పార్టీ వీడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.