కెసిఆర్తో కయ్యం.. జగన్ మోహన్ రెడ్డి తో నెయ్యం అన్న పంధాను బిజెపి అవలంబిస్తున్న ట్లు కనిపిస్తోంది.తాజా పరిణామాలు ఇందుకు నిదర్శనంగా గోచరిస్తున్నాయి.
జగన్కు చేరువ కావడం ద్వారా ఏపీలో తమ ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నారు అదే సమయంలో కేసీఆర్తో కయ్యానికి కాలుదువ్వి అక్కడ బలపడాలని కమలనాథులు భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.జగన్కు సానుకూలం కావడం ద్వారా ప్రధాన ప్రతిపక్షం అనే స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని బిజెపి లెక్కలు వేసింది.తాము కొద్దిగా మద్దతుఇవ్వడం వల్ల ఏపీలో జగన్ సర్కారు బలపడినాతమకు ఎదిగేందుకు ఎలాంటి అవరోధాలు ఉండబోవని బిజెపి నేతలు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే తెలంగాణలో రాజ్యాధికారాన్ని, దాదాపు బలం శూన్యమైన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాను దక్కించుకోవడానికి రెండురాష్ట్రాలలో విభిన్నమైన వ్యూహాలను బిజెపి అమలు చేస్తోంది. మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేది లేదని ప్రకటించటం కమలనాధుల మొదటి ఎత్తుగడగా భావిస్తున్నారు.మరోవైపు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి మోడీ పేరును కూడా తగిలించడం, ఇప్పుడు పేదలకు ఇస్తున్న ఇళ్ల విషయంలో కేంద్రానికి బెనిఫిట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వడం వంటి పరిణామాలు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తమ జట్టుకట్టిన పవన్ కళ్యాణ్తోనూ సైలెంట్ మంత్రాన్ని జపిస్తోంది. దీంతో పవన్ జగన్ ప్రభుత్వం పై విమర్శలను తగ్గించేశారు..అయితే కేంద్రంతో పెడగా వ్యవహరించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్విషయంలో విసిరిం లో దూకుడు పెంచింది. ఇప్పటికే జగన్ చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం తెలంగాణలో కడుతున్న నీటి ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఇటీవల కరోనాపై ప్రధాని నరేంద్ర మోడీ సీఎంలతో జరిగిన సమావేశంలోనూ కేసీఆర్ను హెచ్చరించారు.
అత్యంత ఎక్కువ కరోనా కేసులు వస్తున్న రాష్ట్రాల జాబితాలో ముఖ్యంగా పరీక్షలు చేయని రాష్ట్రాల్లో తెలంగాణకూడా ఉందని ఆయన హెచ్చరించారు. ఆ వెంటనే గవర్నర్ కేసీఆర్పై నిప్పులు చెరగడం ఇక్కడ గమనార్హం.మొనటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి నాలుగు సీట్లు రావడం కమలనాథులకు ఆ రాష్ట్రంపై ఆశలు కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటి పరిస్థితే లేదు కాబట్టి ఇలా రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.