Kidnap: సాధారణంగా పెళ్లిళ్లు అనగానే ముందుగా మనకు గుర్తువచ్చేది హడావిడి. ఇంటి నిండా చుట్టాలు, స్నేహితులు, బంధువులు, పెళ్లి తంతులు ఇలా చాలా హడావిడిగా ఉంటుంది. అదే వధూవరుల విషయానికి వస్తే వారు కొత్త జీవితం లోకి ప్రవేశించబోతున్నందుకు చాలా ఆనందంతో ఉంటారు. అటువంటి తరుణంలో ఇంకొన్ని గంటలలో పెళ్లి అనగా పెళ్లికూతురు కనిపించకపోతే? మనం ఎక్కువగా సినిమాలలో మరియు నిజజీవితంలో ఇటువంటి సందర్భాలలో పెళ్లి కూతురు తనకి ఇష్టమయిన అబ్బాయితో వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకుంటాం. కానీ అనంతపురంలో జరిగిన ఘటన ఇందుకు భిన్నంగా ఉంది.
ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పెళ్లికూతురిని ఎవరు కిడ్నప్ చేసారో కూడా పోలీసులకి తెలుసు. ఇంతకీ కిడ్నప్ చేసింది ఎవరనుకుంటున్నారా? పెళ్లికూతురిని పెళ్లి నుంచి కిడ్నప్ చేసింది స్వయంగా ఆమె బంధువులే.
గురువారం సాయంత్రం, రొద్దాం మండలం లోని గౌరాజ్ పల్లి లో ఓ పెళ్లి జరగాల్సి ఉంది. తన మేకప్ సామాన్లలో కొన్ని మిస్ అయినట్టు అనిపించి ఆ పెళ్లి కూతురు బయటకు వెళ్లాలనుకుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పగా వారు ఇందుకు ఒప్పుకోలేదు. వారితో వాదించి ఆమె బయటకు వెళ్ళింది. ఆమె తనకు కావలసినవి కొనుక్కుని షాప్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆమెకు వరసకు బావ అయ్యే వ్యక్తి బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు.
ఎంతకీ పెండ్లి కుమార్తె ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకి సమాచారం అందించగా ఈ విషయం బయటకు వచ్చింది. అయితే పోలీసులు కిడ్నాపర్లకు తమకు తాముగా లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు కానీ కిడ్నాపర్ ల నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరికి ఈ ఉదంతం కు ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి…..