హైదరాబాద్లోని హఫీజ్పేట భూవివాదం కిడ్నాప్ కేసులో మోస్ట్వాంటెడ్గా మారిన మాదాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను(30) ఎవరు? ఇతనికి భూమా కుటుంబానికి సంబంధం ఏంటి? ఇంజనీరింగ్కు మధ్యలోనే స్వస్తి చెప్పి టీ స్టాల్ నిర్వహిస్తున్న శ్రీను ఆ కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు? అనే అంశాలు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
ఇరు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హఫీజ్పేట భూ వివాదానికి సంబంధించిన కిడ్నాప్ కేసులో మొత్తం స్కెచ్ వెనుక మాదాల శ్రీను ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఎవరీ శ్రీను? అఖిలప్రియ దగ్గరకు ఎలా చేరేను?
కాగా, గుంటూరు నగరంలోని డొంకరోడ్డుకు చెందిన మాదాల శ్రీను ఇంజనీరింగ్ మధ్యలోనే మానేశాడు. ఆయన తండ్రి రమణయ్యకు బ్రాడీపేట మూడోలైనులో టీస్టాల్ ఉంది. శ్రీను చాలాకాలం ఈ టీస్టాల్ నిర్వహించాడు. ఇదిలావుంటే, ఇంజనీరింగ్లో తన స్నేహితుడైన జిల్లా తెలుగు యువత నాయకుడు రాయపాటి సాయికృష్ణ ద్వారా మాజీమంత్రి అఖిలప్రియతో శ్రీనుకు పరిచయం ఏర్పడింది. భూమా కుటుంబానికి గుంటూరు విద్యానగర్లో ఉన్న ఇంటిని అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయంగా వాడేవారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేసే బాధ్యతను శ్రీను తీసుకున్నారు.ఈ క్రమంలో భూమా కుటుంబానికి చేరువయ్యాడు. అఖిలప్రియ, భార్గవ్రామ్లకు వివాహం జరిగాక భార్గవ్రామ్తోనూ మరింత సన్నిహితంగా మారి ఆయనకు ఆంతరంగిక వ్యక్తిగా మారాడు. ఈ క్రమంలో గతంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో శ్రీను భూమా కుటుంబంలో ఒకడిగా కీలకంగా వ్యవహరించాడు. మరోవైపు, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు జరిగిన కుట్రలో కిరాయి హంతక ముఠాకు రూ.50 లక్షలు అందించింది కూడా మాదాల శ్రీనుయేనని అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఆ కేసులో అరెస్టయిన శ్రీను మూడు నెలలు జైల్లో ఉండి విడుదలయ్యాడు. అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో శ్రీను పలు రోడ్డు కాంట్రాక్టులు చేశాడు.
సినీ ఫక్కీలో వ్యవహారం..సినీ ట్రైనర్ దగ్గర శిక్షణ!
హఫీజ్పేట ఘటనలో భూమా కుటుంబం తరఫున మాదాల శ్రీను కిడ్నాప్ కథను నడిపించాడని పోలీసులు తెలిపారు. హైదరాబాదులోని శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న సినీ ఆర్టిస్ట్ కంపెనీ నుంచి ఐటీ అధికారులు, పోలీసులకు సంబందించిన డ్రస్లు అద్దెకు తీసుకొన్నాడు. అనంతరం, ఓ సినీ ట్రైనర్ దగ్గర మూడు రోజుల పాటు శిక్షణ తీసుకొని బాధితులకు అనుమానం రాకుండా కిడ్నాప్ నకు పక్కా ప్రణాళిక రూపొందించాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో భార్గవ్రామ్ పాత్ర ఏంటనేది స్పష్టం కాకపోయినప్పటికీ శ్రీను మాత్రం ఈ ఘటనకు సూత్రదారిగా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ వ్యవహారం గుంటూరులో చర్చనీయాంశమైంది. శ్రీనుకు ఆది నుంచి నేరప్రవృత్తి లేకపోయినా.. ఇలా ఎలా వ్యవహరించాడనే విషయంపై సన్నిహితులు, బంధువుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీను వ్యవహారంపై రాష్ట్ర పోలీసులు కూడా ఆరా తీస్తుండడం గమనార్హం.