కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకున్న అంపైర్ తప్పిదం మూలంగా పంజాబ్ జట్టు ఒక మ్యాచ్ను నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే సదరు అంపైర్పై పంజాబ్ టీం మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. దీంతో రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఈ అంశంపై తదుపరి వివరాలను పరిశీలించనున్నారు.
ఆదివారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రబాడా విసిరిన 3వ బంతికి పంజాబ్ ప్లేయర్లు మయాంక్ అగర్వాల్, క్రిస్ జోర్డాన్లు 2 పరుగులు తీశారు. కానీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం 1 పరుగును మాత్రమే ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ ఒక పరుగు తీసే క్రమంలో బ్యాట్ను క్రీజులో ఉంచలేదని భావించిన అంపైర్ వారు 2 పరుగులు తీసినప్పటికీ 1 పరుగును మాత్రమే ఇచ్చాడు. కానీ రీప్లేలో జోర్డాన్ తన బ్యాట్ను క్రీజులో ఉంచినట్లు స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ వారికి 1 పరుగు మాత్రమే దక్కింది. అయితే మ్యాచ్ మాత్రం ఆ ఒక్క పరుగు వల్లే టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలుపొందింది. అదే ఆ 1 పరుగు లభించి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లేది కాదు. పంజాబ్ జట్టే గెలిచి ఉండేది. కానీ అంపైర్ తప్పిదం వల్ల పంజాబ్ ఒక మ్యాచ్ను నష్టపోవాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టు ఓనర్ ప్రీతి జింటాతోపాటు మాజీ క్రికెట్ ప్లేయర్లు, విశ్లేషకులు అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే ఇదే విషయంపై పంజాబ్ సోమవారం మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్కు ఫిర్యాదు చేసింది.
అయినప్పటికీ ఈ విషయంలో రిఫరీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేడు. మ్యాచ్ ఫలితాన్ని మార్చలేడు. అసలు ఈ విషయంపై ఐపీఎల్ రూల్ బుక్లో ఎలాంటి నియమాలు లేవు. అందువల్ల పంజాబ్ రిఫరీకి ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే పంజాబ్ మాత్రం సంప్రదాయం ప్రకారం రిఫరీకి ఫిర్యాదు చేసింది. వారికే కాదు, ఏ జట్టుకైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రిఫరీకి ఫిర్యాదు చేసే అధికారం ఉంటుంది. కానీ.. మ్యాచ్ ఫలితాన్ని మాత్రం రిఫరీలు మార్చలేరు. కనుక పంజాబ్ అనవసరంగా ఒక మ్యాచ్ను నష్టపోయిందని చెప్పవచ్చు.