బీహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు సాధించటం ద్వారా తన సత్తా చూపిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ర్టాల్లో కూడా తనకుగల విజయ అవకాశాలను పరిశీలిస్తోంది.ఈ క్రమంలో మజ్లిస్ పార్టీ కన్ను ఏపీపై కూడా పడిందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో కనీసం పదిహేను నియోజకవర్గాల్లో ముస్లింల డామినేషన్ ఉంది. దీంతో మజ్లిస్ అధినేత ఒవైసీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోటీకి దిగితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారని దారుస్సలాం వర్గాలు చెప్పాయి.మజ్లిస్ పార్టీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అది ఇంతకుముందు కేవలం హైద్రాబాదు కి పరిమితమైంది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైద్రాబాదులో ఏడు సీట్లు మజ్లిస్ పార్టీకి లభించాయి .ఇక హైద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని మజ్లిస్ కే అన్ని పార్టీలు రాసిచ్చేశాయి. మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఒవైసీ బతికున్నంతకాలం ఆయన ఎంపీగా ఉన్నారు.ఇప్పుడు ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టారు.వరుసగా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.ఇంకా చెప్పాలంటే హైద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ అన్నది నామమాత్రం.పోలింగ్ జరగకుండానే అక్కడ మజ్లిస్ గెలుస్తారని చెప్పటం వాస్తవం.
కాగా ఇటీవల మజ్లిస్ జాతీయ పార్టీగా రూపు దిద్దుకుంది.ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేసి రెండు సీట్లను దక్కించుకుంది.తాజాగా బీహార్లో హోరాహోరీగా జరిగిన పోరులో కూడా మజ్లిస్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు గెలవటం ఆల్టైమ్ రికార్డ్.ఈ విజయంతో మజ్లిస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న సమాలోచనలు మొదలెట్టింది.ఈ సందర్భంలో వారికి ఆంధ్రప్రదేశ్ కనిపించిందట.ఎప్పటి నుండో ఏపీలో పోటీ చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.మొన్నటి ఎన్నికల్లో ఏపీలో పోటీకి ఒవైసీ సిద్ధమైనప్పటికీ జగన్ కి మిత్రుడిగా ఉన్న కెసిఆర్ సలహా మేరకు మజ్లిస్ వెనక్కితగ్గిందంటున్నారు.
ఇప్పుడు కెసిఆర్ కి జగన్ కి కూడా సంబంధాలు కొద్దిగా చెడినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఒవైసీ ఏపీ వైపు దూసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు .నిజానికి ఏపీలో ఉన్న పార్టీలన్నింటిపై ముస్లింలకు అసంతృప్తి ఉంది.వారు తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప తమకు చేసిందేమీ లేదని ముస్లింలు భావిస్తున్నారు.జగన్ తన మంత్రివర్గ సహచరుడు అంజాద్ బాషాను ఉపముఖ్యమంత్రిని చేసినప్పటికీ మరో ఇక్బాల్ అనే నాయకుడ్ని ఎమ్మెల్సీని చేసినప్పటికీ అంతా రాజకీయ డ్రామా అని భావిస్తున్నవారున్నారు.ఈ పరిస్థితుల్లో ముస్లిములు సొంత పార్టీ గా భావించే మజ్లిస్ గనుక ఏపీలో రంగప్రవేశం చేస్తే రాజకీయ సమీకరణాలు మారతాయని, వైసిపి ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.