మన జీవితంలో పుస్తకాలు చదవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పుస్తకాలు చదివేటప్పుడు మనంచాల చురుకుగా ఉంటాము. పుస్తకాలు కొన్ని శతాబ్దాల పాతవి కావచ్చు. కానీ భవిష్యత్తు ఏమిటో అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. మానవ నాగరికత అనేది ఎప్పుడు జ్ఞానం ఆధారంగా ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఆ జ్ఞానాన్ని పొందడానికి పుస్తకం చదవడం ఒక సులభమైన మార్గం.ఒక మంచి పుస్తకం నాగరికత ను ముందుకు తీసుకువెళుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఐరోపా క్రూసేడ్ యుద్ధాలు, అలెగ్జాండర్ విజయం, ప్రాచీన భారతదేశం కీర్తి, రాజుల ఘనత ఎలా ఉండేదో మనం తెలుసుకోవచ్చు. శంకరాచార్య బోధనలు, సోక్రటీస్ తత్వశాస్త్రం, గెలీలియో సైన్స్, కౌటిల్య అర్ధశాస్త్ర, రూమి సూఫీ కవితలను మనం పుస్తకాల ద్వారానే తెలుసుకోగలిగాం.
మహాభారతం లేదా ఇలియడ్ వంటి కొన్ని పురాణాలను చదివిన తర్వాత వ్యక్తిత్వంలో మార్పులు రావడం స్ఫష్టం గా తెలుస్తుంది.. మనల్ని మనం ప్రేమించుకోవడానికి , మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి ముఖ్యంగా మన వ్యక్తిత్వాలను పరీక్షించుకోవడం కోసం మనం చదవాలి. యువతరం కూడా చదవడంలో అర్థం లేదని భావిస్తోంది. ఎవరో ఒకసారి అన్నట్లుగా మీరు ఒక నాగరికతను చంపాలనుకుంటే ప్రజలను చదవకుండా ఆపండి అని అన్నారు.
అంటే మనం ఇప్పుడు ఇంచు మించుగా అలాంటి ప్రమాదకరమైన స్థితిలోనే ఉన్నామని అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరికైనా లేదా మన పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతులలో ముందు నిలిచేది పుస్తకమే. ఒక పుస్తకం ద్వారా మనం తెలుసుకోలేనిది అంటూ ఏది లేదు.. ఇప్పటివరకు చదివే అలవాటు లేకపోయినా ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాం. తరగతి గదిలో మనం పొందే జ్ఞానం చాలా తక్కువ, ఎక్కువ జ్ఞానం ఒక పుస్తకం రూపం లో ఎదురుచూస్తోందని యువతరం తెలుసుకోవాలి.
మీరు చదవాలని నిర్ణయించుకుంటే, మీ ఇష్టం మైన అంశం ఏది అయితే ఆ పుస్తకం దగ్గరనుండి చదవడం ప్రారంభించండి.. అది ఒక నవల లేదా చిన్నకవిత కథ ఏదైనా కావచ్చు. కాకా పొతే చదివేది మనకి బాగా ఆసక్తి అయినది అయి ఉండాలి.