ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ తిరుమల తిరుపతి దేవాలయంలో డిక్లరేషన్ ఇవ్వడం, మరోవైపు దేవాలయాలపై దాడుల అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఏకంగా డిక్లరేషన్ తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఏకంగా ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సీఎం జగన్ను కాపాడబోయి…
తిరుమల తిరుపతి దేవాలయంలో డిక్లరేషన్ గురించి స్పందించడంతో పాటుగా దేవాలయాల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలే పోటీ పడి దాడులు చేయిస్తున్నాయని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే, ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.దేవుడిపై మంత్రి కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల స్థాయిల్లోని ఆలయాల్లో ఆంజనేయస్వామికి పార్టీ నేతలతో వినతిపత్రం ఇప్పించారు. వెంకన్న ఏమైనా నానికి బావమరిదా… డిక్లరేషన్ ఎవరు పెట్టారు అంటారా ? ఆంజనేయ స్వామి చేయి విరగ్గొడితే ఆయనకు నష్టమా, రధం దగ్ధం అయితే… కోటి రూపాయలతో చేపిస్తున్నారు అంటూ దేవుడిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు.
ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే ఏం లాభం?
వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని అప్పుడు వైఎస్సార్కు, ఇప్పుడు జగన్కు ఆ ఏడుకొండల వాడే కల్పించాడని మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమల డిక్లరేషన్ తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కొడాలి నాని అన్నారు. డిక్లరేషన్ ఎవరు పెట్టారు.. ఎప్పుడు పెట్టారనే అంశంపై చర్చ జరగాలన్నారు.
ఈ స్వామి కూడా ఫైరయ్యాడే…..
కాకినాడ శ్రీ పీఠానికి చెందిన స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని హిందువు అయినప్పటికీ,ఆయన తల్లి తండ్రులు హిందువులు అయినప్పటికీ తిరుమల ఆలయంలో వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ ఫారమ్లో నాని సంతకం చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నానికి తన మతంపై నమ్మకం లేదని, ఎందుకంటే హిందూ దేవతల విగ్రహాలను ప్రాణంలేని వస్తువులతో పోల్చారని అన్నారు. తిరుమల స్వామివారితో పెట్టుకోవద్దని కొడాలి నానిని హెచ్చరించారు. ఒక స్వామిగా కొడాలి నాని హిందువు కాలేడని చెబుతున్నానని అన్నారు. నాని లా మేము దిగజారి మాట్లాడలేమని పరిపూర్ణానంద అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పినట్టు హిందువుల మనోభావాలను గౌరవించాలని అన్నారు.