విజయవాడ స్వర్ణ ప్యాలెస్లోని కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది, ఎందరినో కలచి వేసింది.
ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో కన్ను మూసిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఆ హామీ నిలబెట్టుకున్నారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి బాధితులకు తాజాగా మంత్రి కొడాలి నాని చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్ రమేష్ను ఎవరెవరూ కాపాడుతున్నారంటే
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రూ.50 లక్షలు, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రూ.కోటి చొప్పున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిహారం ఇచ్చారని పేర్కొన్నా మంత్రి కొడాలి నాని ప్రమాద ఘటనకు పరిహారం విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రమేష్ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొన్న కొడాలి నాని రమేష్ను రక్షించేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రయత్నం జరుగుతుందని సంచలన కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ఇంట్లోనే డాక్టర్ రమేష్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ఇంట్లోనే డాక్టర్ రమేష్ను పెట్టుకుని కాపలా కాస్తున్నారని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాపలా కాసినా రమేష్ను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు కేవలం కమ్మ వారి గురించే ఆలోచిస్తారని కొడాలి నాని మండిపడ్డారు. అదికూడా ఆయనకు కావలసిన కమ్మవారిగురించే ఆలోచిస్తారని… చంద్రబాబు నాయుడు కమ్మసంఘం అధ్యక్షుడు అవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వారి విషయంలో నానా యాగీ చేసే బాబు కమ్మ వారి విషయంలో వెనకేసుకురావడం సరి కాదని కొడాలి నాని అన్నారు.
చంద్రబాబుకు కొత్త వ్యాధి
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో విదేశీ కంపెనీ వ్యక్తులు గ్యాస్ లీక్ చేశారని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు సలహాలు వినే రమేష్ ఎంక్వయిరీకి రాకుండా పోయారన్నారు. ఎంక్వయిరీకి రాకుండా పారిపోయిన రమేష్ కు మాజీ ముఖ్యమంత్రి ఆశ్రయం కల్పించాడన్నారు. ‘‘చంద్రబాబు ‘ఎల్జీమర్’ వ్యాధితో బాధ పడుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కు ఏం జరిగిందో తెలుసా?
బాధితుల పరామర్శకు వస్తే కరోనా వస్తుందని చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో దాక్కున్నారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశౄరు. తనకు కూడా ఎక్స్గ్రేషియా వస్తుందని బాబు భయపడుతున్నారని కామెంట్ చేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకు నాయుడుకు వయస్సు పెరిగిన బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు అని, రానున్న రోజుల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని మంత్రి కొడాలి నాని విమర్శించారు. హీరో రామ్ చంద్రబాబు మాటలు వినకుంటే మంచిదని..గతంలో చంద్రబాబు నాయుడు సినిమా వాళ్లని వాడుకుని వదిలేశారని అన్నారు. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ను అడిగితే తెలుస్తుందన్నారు.