Kodali Nani – Vangaveeti Radha: దేశంలో రాష్ట్రంలో మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్య ప్రజల నుండి రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్న వారు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా ఏపిలో ఏపిలో మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
Kodali Nani – Vangaveeti Radha: ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో చికిత్స
అదే విధంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కూడా కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ణారణ అవ్వడంతో ఆయన కూడా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాధా రీసెంట్ గా నందిగామ నియోజకవర్గంలో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవ్వగా..అక్కడి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రాధాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఇటీవల తనతో కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మరో పక్క కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన కూడా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనతో పాటు తిరిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. చక్రపాణి రెడ్డి కరోనా బారిన పడటం ఇది రెండో సారి. గతంలో కరోనా బారిన పడి కోలుకున్నారు.