అమరావతి: బలవన్మరణం పొందిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని పోస్ట్ మార్టం అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు తరలించారు. టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ తదితర పార్టీ నేతలు, ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఆయనను వేధించి ఉరి వేసుకునే పరిస్థితి తెచ్చారంటే ఎంత దుర్మార్గమో చెప్పండి అన్నారు. కోడెలది ఆత్మ హత్య కాదు, ప్రభుత్వ హత్యే అని చంద్రబాబు అన్నారు.
నియోజకవర్గాలలో నిరసన ప్రదర్శనలు..
ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాలలో మంగళవారం పార్టీ నేతలు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంతాప సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కార్యాలయాలపై టీడీపీ జెండాలు అవనతం చేయాలని చంద్రబాబు సూచించారు.
కోడెల అంతిమ యాత్ర ను అడ్డుకునేందుకు ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో నర్సరావుపేట డివిజన్ లో 144సెక్షన్ అమలు చేస్తున్నారని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.