ఎస్ ఎస్ రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ లను అందుకున్నాయి. అలాగే రాజమౌళి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ఇద్దరి స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అదే ” రౌద్రం రణం రుథిరం “.
బాహుబలి ఫ్రాంఛైజీ లాంటి గొప్ప సినిమా తర్వాత రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లు పోరాట యోధులుగా నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తోంది. బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తుంది. ఇక అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు కరోనా కారణంగా సినిమా చాలా సార్లు మొదలు పెట్టాలనుకొని వందల మంది కార్మీకులు, యూనిట్ సభ్యులని దృష్ఠిలో పెట్టుకొని ఆగిపోయాడు రాజమౌళి.
కాగా ఎట్టకేలకి మళ్ళీ ఈ సినిమాని సెట్స్ మీదకి తెచ్చేందుకు రాజమౌళి సిద్దమయ్యాడు. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నీ బద్రతల మధ్య రాజమౌళి చిత్రీకరణ జరపనున్నాడని తెలుస్తుంది. అక్టోబర్ 2 వ వారం నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలవబోతుండగా మొదట ఎన్.టి.ఆర్ మాత్రమే పాల్గొనబోతున్నాడు. అంతేకాదు ముందు కొమరం భీమ్ పాత్రకి సంబంధించిన సీన్స్ షూట్ చేసి టీజర్ రెడీ చేయనున్నట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే దీపావళి సందర్భంగా ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ టీజర్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.