Komatireddy: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా తన ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు.ఈ పదవి కోసం కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా పోటీ పడటం తెలిసిందే. ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడంతో వెంకటరెడ్డికి మొండిచేయి ఎదురైంది.దీంతో ఆయన భగ్గుమనడం,టీపీసీసీఅంటే తెలుగుదేశం పీసీసీ అంటూ వ్యాఖ్యానించడం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ కి 30 కోట్ల రూపాయల లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి ఈ పదవి పొందారంటూ ఆరోపించడం కూడా విదితమే.
స్థానిక గాంధీభవన్ లో అడుగుపెట్టబోనని కూడా వెంకటరెడ్డి శపథం చేశారు.రేవంత్ రెడ్డి కి అంత దమ్ముంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన సవాల్ విసిరారు.ఇదంతా గత చరిత్రే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.రేవంత్ రెడ్డి కి పదవి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో మెరుగుపడలేదని చెప్పటానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో ప్రయత్నం చేశారు.అదెలాగంటే?
ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ కి వచ్చే ఓట్లు 5 శాతం కన్నా తక్కువట!
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపోటములపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి తాను సర్వే చేయించగా 67 శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు వస్తాయని తేలిందన్నారు.30 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పడేటట్లు ఉన్నాయని కోమటిరెడ్డి తెలిపారు.ఇక తన సొంత పార్టీ కాంగ్రెస్కు 5 శాతం లోపే ఓట్లు వచ్చేలా ఉన్నాయని వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కనుక ముందే అభ్యర్థిని ప్రకటించి కొద్దిగా ప్రచారం ఉధృతం పెంచితే ఇంకొన్ని ఓట్లు అదనంగా రావచ్చునని తెలిపారు.కానీ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపన్నది అసంభవమని మాత్రం వెంకటరెడ్డి చెప్పకనే చెప్పారు.అయితే ఈ ఉప ఎన్నికను తానేమీ పట్టించుకోనని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడేలా చేయటానికి తాను పాటుపడతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.కాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగానే నడుచుకుంటూ ఈ తరహా సర్వే నివేదికను బయట పెట్టారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.తద్వారా రేవంత్ రెడ్డి వల్ల పార్టీ పరిస్థితి మెరుగు కాలేదన్న సంకేతాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన పంపారంటున్నారు.