అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఉప సభాపతిగా ఎన్నికైన రఘుపతిని స్పీకర్ అభినందించారు. అనంతరం ఉప సభాపతిని చైర్ వద్దకు ఆహ్వానించాల్సిందిగా సభానాయకుడు, ఇతర పార్టీ నేతలను స్పీకర్ కోరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులు ఉప సభాపతిగా ఎన్నికైన రఘుపతికి అభినందనలు తెలియజేస్తూ ఆయనను స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. అనంతరం మంత్రులు, ఇతర శాసనసభ్యులు ఉప సభాపతిని కలిసి అభినందనలు తెలియజేశారు.
సభాపతిగా తమ్మినేని సీతారాం ఎన్నికైన సమయంలో ఆయన్ను ఆహ్వానించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకుండా పార్టీ నేత అచ్చెన్నాయుడును పంపడంపై అధికార పార్టీ నుండి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు జగన్తో పాటు చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.