(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల మాటున అవినీతి అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికారాని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడరని నాటి ప్రతిపక్ష, నేటి అధికార పక్ష వైసీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతల అవినీతి, అక్రమాలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉంది.
అక్రమాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక పక్క అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా పలు నియోజకవర్గాల్లో యదేశ్చగా అక్రమ క్వారీయింగ్ జరుగుతున్నాయి. ఇటీవల సత్తెనపల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఆ పార్టీ నేతలే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కొండపల్లి రిజర్వు ఫారెస్టులో లీజులు రద్దు
తాజాగా కొండపల్లి రిజర్వు ఫారెస్ట్లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు అధికార యంత్రాంగమే దృవీకరించింది. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్లో భూముల తవ్వకాలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పరిశీలన చేసి అక్రమ తవ్వకాలు జరిగినట్లు దృవీకరించింది. అక్కడ ఇచ్చిన క్వారీ లీజులను రద్దు చేసి భూములను అటవీ శాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్కు త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసింది. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ ఇంతియాజ్ లీజులను రద్దు చేయాలని గనుల శాఖకు ఆదేశించారు.
ఇళ్ల స్థలాల మెరక ముసుగులో
మైలవరం నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు పెద్ద ఎత్తున అక్రమ క్వారీయింగ్కు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసే ఇళ్ల స్థలాల మెరక తోలేందుకు అంటూ అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాలపై అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు గత నెలలో దాడులు చేసి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా అధికారులు కేవలం పది లక్షల జరిమానాతో సరిపెట్టారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా క్వారీ లీజ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇబ్రహీంపట్నంలో టిడిపి నేతలపై దాడి
నిన్న టిడిపి బృందం కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లింది. పరిశీలన అనంతరం వీరు తిరిగి వచ్చి ఇబ్రహీంపట్నంలోని ఒ హోటల్ లో భోజనం చేస్తుండగా టిడిపి నాయకుడు సజ్జా అజయ్పై కొందరు దాడి చేశారు. సజ్జా అజయ్పై దాడిని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఖండించారు. దాడులకు భయపడేది లేదని అక్రమ క్వారీయింగ్ను అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఒక పక్క సత్తెనపల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ క్వారీయింగ్ పై ఆరోపణలు వచ్చిన రెండు మూడు రోజుల వ్యవధిలో కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అక్రమ క్వారీయింగ్ వెలుగు చూడటం అధికార పార్టీకి ఇరుకున పెట్టే అంశంగా మారుతోంది.