మహిళలే మహారాణులు అన్నారు పెద్దలు. అలంటి మహారాణులకే మహారాణి గా నిలిచారు అత్యంత సంపన్న మహిళలు. కోటక్ వెల్త్ మేనేజ్మెంట్, హురున్ ఇండియా అనే సంస్థలు తాజాగా వెల్లడించిన నివేదికలో భారత్ దేశ టాప్ 100 మంది మహిళా సంపద సృష్టికర్తల
జాబితాను విడుదల చేసారు.‘కోటక్ వెల్త్ హురున్ – లీడింగ్ వెల్దీ వుమెన్ 2020’ నివేదిక ప్రకారం హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఆ తరువాతి స్థానాలలో కిరణ్ మజుందార్ షా(బయోకాన్ ఛైర్ పర్సన్), లీనా గాంధీ తివారి (యూఎస్వీ ఛైర్పర్సన్) ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల సంపదను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక తయారీలో కుటుంబ వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ నివేదిక లో మొదటి ముగ్గురు హెచ్సీఎల్ టెక్నాలజీస్, బయోకాన్, యూఎస్వీ ఛైర్పర్సన్లు కాగా, నాలుగో స్థానం హైదరాబాద్కు చెందిన దివీస్ లేబొరేటరీస్ డైరెక్టర్ మహిళ నీలిమా మోటపార్తికి దక్కింది.ఆమె సంపద రూ.18,620 కోట్లు. జోహోకు చెందిన రాధా వెంబు (5 వ స్థానం), అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ (6వ స్థానం), హీరో ఫిన్కార్ప్కు చెందిన రేణు ముంజాల్ (7 వ స్థానం), అలెంబిక్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ మాలికా చిరాయు అమిన్ (8వ స్థానం), థర్మక్స్కు చెందిన అను ఆగా, మెహర్పుదుంజీ (9వ స్థానం), ఫల్గుని నాయర్, కుటుంబం (10 వ స్థానం) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే 100 మంది జాబితాలో, 13 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్- తెలంగాణా రాష్ట్రాలకు చెందిన వారు. హైదరాబాద్కు చెందిన 32 ఏళ్ల అంజనా రెడ్డి (యూనివర్సల్ స్పోర్ట్స్బిజ్) ఈ జాబితాలో స్థానం సంపాదించటం ప్రత్యేకత. అత్యంత ధనిక మహిళల్లో ఎక్కువ మంది ముంబయిలో ఉన్నారు. ఆ తర్వాత దిల్లీ, హైదరాబాద్కు చెందిన వారికి ఈ జాబితాలో స్థానం లభించింది.
మనదేశంలో సంపద సృష్టిలో గత రెండు దశాబ్దాల్లో మహిళల పాత్ర విస్తృతం అయినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ దాస్ పేర్కొన్నారు. 2020- కోటక్ వెల్త్- హురున్ ఇండియా సంపన్న మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్న మహిళల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన విజయగాథగా ఆయన అభివర్ణించారు. ఈ జాబితా చూసి ఎంతోమంది మహిళలు ఉత్తేజితులై మరింతగా ఎదగడానికి, సంపద సృష్టించడానికి ప్రయత్నిస్తారనే ఆశాభావాన్ని హురున్ ఇండియా ఎండీ అనస్ రెహ్మాన్ అభిప్రాయపడ్డారు.
ధనిక మహిళల్లోని మొదటి 100 మంది సగటు సంపద రూ.2,72,540 కోట్లు అని నివేదిక తెలిపింది. మొత్తం ఎనిమిది మంది డాలర్ బిలియనీర్లు ఉండగా, జాబితాలో 38 మంది మహిళలు రూ.1,000 కోట్లు, అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో మహిళల సగటు వయస్సు 53 సంవత్సరాలు. 69 మంది సంపద సంరక్షకులు కాగా, 31 మంది స్వయంగా పైకొచ్చిన మహిళలు ఉన్నారు.