Krishnapatnam Anandaiah: కరోనా మందు ఉచితంగా పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. అనందయ్య కరోనా మందు పంపిణీని ప్రభుత్వం నిలుపుదల చేయడంతో ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది.
ఆనందయ్య పంపిణీ చేసే నాటు మందు వల్ల ప్రజలకు నష్టం వాటిల్లదని ఆయుష్, వైద్య నిపుణులు నివేదికలు సమర్పించిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆనందయ్య రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తన మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని, చివరకు కోర్టు ఆదేశాలతో పంపిణీకి అనుమతి ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనందయ్య.
Krishnapatnam Anandaiah: ఆనందయ్య తాజాగా తీసుకున్న ఓ కీలక నిర్ణయం
ఆనందయ్య తాజాగా తీసుకున్న ఓ కీలక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఆనందయ్య కరోనా మందు పంపిణీ నిలిచిపోయిన సందర్భంలో ప్రతిపక్షాలు ఆనందయ్యకు మద్దతుగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా ఆనందయ్య మాత్రం నాడు వైసీపీ నేతల పట్ల, ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించారు. ప్రభుత్వాన్ని విమర్శించలేదు. అటువంటిది ఇప్పుడు తాను త్వరలోనే యాదవుల రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ఆనందయ్య ప్రకటించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
మిగిలిన బీసీ కులాలతే కలిసి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రధయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సందర్భంలో తాను తయారు చేసిన కరోనా మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని ఆనందయ్య ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆనందయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందించి వివరణ ఇస్తారో వేచి చూడాలి.