తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురించి కొత్త చర్చ నడుస్తోంది. హోరా హోరీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచార పర్వం మొత్తం తన భుజాలపై వేసుకున్న ఈ యువనేత ఆ సమయంలో చేసిన కామెంట్లు , ప్రస్తుతం వెలువడిన ఫలితాలు, అనంతరం కావాల్సిన రాజకీయ లెక్కల గురించే ఈ టాక్. ప్రచారంలో చేసిన కామెంట్ ప్రత్యర్థులకు చిక్కేలా చేసిందంటున్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని.. మేయర్ పీఠంపై కూర్చోబోయే వ్యక్తి ఎంఐఎం పార్టీకి చెందిన వారేనని బీజేపీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అలాంటిది ఏమీలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఫలితాలు సీన్ మార్చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మరోసారి సత్తా చాటింది. 44 స్థానాల్లో విజయం సాధించింది మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అదే సమయంలో గ్రేటర్లో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎంఐఎం కీలకంగా మారింది. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన పార్టీ వారే మేయర్ అభ్యర్థి కానున్నారు.
ఓవైసీ కీలక వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఫలితాలను అర్థం చేసుకోవాలి, గౌరవించాలని ఒవైసీ పేర్కొన్నారు. గ్రేటర్లో బీజేపీ విజయం తాత్కాలికం మాత్రమేనని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఫలితాలు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేసిన ఒవైసీ… రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఫలితాలు ప్రకటించిన తర్వాత పార్టీలో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేటీఆర్ కీలక సమావేశం
ఇదిలాఉండగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఊహించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఏం చేయనుందనే చర్చ మొదలైంది. ఎక్స్అఫిషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మరొకరి సాయం తీసుకోకుండా మేయర్ పీఠం ఎక్కలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక సమావేశానికి సిద్ధమయ్యారు.తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉండగా… పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా? అనే చర్చ సాగుతోంది. ఒకవేళ ఎంఐఎంతో పొత్తు గురించి నిర్ణయం తీసుకుంటే గతంలో ఎదురుదాడి చేసిన విపక్షాలు మళ్లీ కేటీఆర్ను ఈ అంశంలో బుక్ చేస్తాయా? అనే చర్చ జరుగుతోంది.