హైదరాబాదు: గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరో సారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు సవాల్పై కెటిఆర్ మాట్లాడుతూ ఆయన చెప్పిన టైమ్కు పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేయాలంట, ఇదెక్కడి చిల్లర రాజకీయం అని ప్రశ్నించారు.
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కెటిఆర్ స్పష్టం చేశారు. కొందరు నేతలు బుద్ది, జ్ఞానం, సోయి లేకుండా మాట్లాడుతున్నారంటూ కెటిఆర్ విమర్శించారు.
ఈ వివాదం విషయంలో తాము సంయమనం పాటిస్తున్నామని కెటిఆర్ చెప్పారు. పిల్లల జీవితాలతో రాజకీయ నాయకులు ఆడుకోవద్దని కెటిఆర్ హితవు పలికారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయంటూ కెటిఆర్ విమర్శించారు.
‘ఇంటర్ విద్యార్థులకు చేతులు జోడించి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే తిరిగిరావు. చదువే జీవితం కాదు. తప్పు జరిగింది. ప్రభుత్వం మళ్లీ రీవెరిఫికేషన్ చేస్తోంది. కాబట్టి తొందరపడి ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లను క్షోభకు గురిచేయవద్దు’ అని కెటిఆర్ కోరారు.
పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.