తెలంగాణలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. దుబ్బాక ఎన్నికల్లో వచ్చిన కీలక తీర్పు ఈ క్రేజ్కు కారణం. అయితే, ఈ సమయంలో త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అన్ని పార్టీల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి.
ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పలువురికి వరాలు కురిపించారు. దీపావళి పర్వదినం సందర్భంగా జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త అందించిందని, వారి జీతాన్ని మరో రూ. 3 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు.
హైదరాబాద్లో కరోనా కేసులు వారి వల్లే…
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్కు ఒక ప్రత్యేకత అంటూ ఉన్నది సఫాయి కార్మికుల వల్లేనని తెలిపారు. హైదరాబాద్ పట్టణం మిగతా పట్టణాలతో పోల్చితే మెరుగ్గా ఉంది అంటే అటు ముంబై, బెంగళూరు, చెన్నైలతో పోల్చుకుంటే కేసుల తీవ్రత తగ్గిందన్నారు. దీనికి ప్రధాన కారణం జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్క్స్ పనితీరే అని కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హెల్త్ వర్కర్స్ , పారిశుద్ధ్య కార్మికులు పెద్దఎత్తున ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ సెల్యూట్ కొట్టారు
పారిశుద్ధ్య కార్మికుల పట్ల సీఎం కేసీఆర్కు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉందని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. చరిత్రలో ఏ సీఎం కూడా చేయని విధంగా సీఎం కార్యాలయంలో జీహెచ్ఎంసీ వర్కర్క్స్తో కూర్చుని వారి సాదకబాధలపై చర్చించారు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి సెల్యూట్ కొట్టారు. వారు చేసే సేవలతోనే హైదరాబాద్ నేడు ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉందన్నారు. హైదరాబాద్కు ఒక ప్రత్యేకత అంటూ ఉన్నది వారి వల్లనే అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో వారి జీతాల పెంపును చేపట్టిందన్నారు.
మా పాలనలోనే ఎన్నో వెలుగులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సఫాయి కార్మికుల జీవితాల్లో వెలుగులు పూశాయన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటిదాకా సఫాయి కార్మికుల జీతాలు జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 8,500 ఉండేది. దాన్ని సీఎం కేసీఆర్ 2015లో రూ. 12,500 చేశారు. 2017లో మరోసారి జీతాల పెంపుపై ఆదేశాలు ఇచ్చారు. వాళ్లకు ఎంత చేసినా తక్కువనే అన్నారు. వాళ్ల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్న తక్కువనే తెలిపారు. ఎందుకంటే నగరంలో కోటి మంది చెత్త ఉత్పత్తి చేస్తుంటే అది శుభ్రం చేసేందుకు 25 వేల మంది కష్టపడుతున్నారని చెప్పి వారి జీతాన్ని రూ.14,500 చేశారు. నేడు దీపావళి కానుకగా మరో రూ. 3 వేలు జోడిస్తూ వారి జీతాన్ని రూ. 17,500గా చేస్తున్నట్లు ప్రకటించారు.