ఇప్పుడు అందరి చూపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు గ్రేటర్ పోరులో చెమటోడుస్తున్నాయి.
ఓటు కోసం ఎత్తుగడలు వేస్తున్నాయి. తమ ప్రణాళికలు ప్రజల ముందు ఉంచుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర లేపాయి.
బీజేపీని సెంటిమెంట్తో కొట్టారుగా…
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ ఎప్పట్లాగే బీజేపీని టార్గెట్ చేశారు. గల్లీ ఎలక్షన్ కోసం …ఢిల్లీ నుంచి పెద్ద పెద్డ బీజేపీ నేతలు వస్తున్నారని, అక్కడే వారు చిత్తు చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో ఎటువంటి పంచాయతీలు లేవని అన్నారు. హైదరాబాద్ మీద బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అంటున్నారు, హైదరాబాద్ ఏమైనా పాకిస్థాన్ లో ఉన్నదా ? అని ఆయన ప్రశ్నించారు. పేదరికం, నిరుద్యోగము మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అగయిత్యాలు చేస్తున్న వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు.
ఆంధ్రోళ్ల సెంటిమెంట్ను ….
ఇటు తెలంగాణ అటు ఆంధ్రా సెంటిమెంట్ను కేటీఆర్ ఈ సందర్భంగా టచ్ చేశారు. వరదల కోసం సాయం అడిగితే కేంద్రం నుంచి బదులు లేదని అన్నారు. హైదరాబాద్ పై ఎందుకు సవతి తల్లి ప్రేమ ? మోదీ…తెలంగాణ నీకు ఏం ద్రోహం చేసింది ? అని అయన ప్రశ్నించారు. మోదీ అమరావతికి పోయి తట్టెడు మట్టి ఇచ్చిపోయారని ఆయన అన్నారు. తద్వారా ఇటు తెలంగాణలోని ప్రజలు అటు ఆంధ్రాలోని ప్రజలను ఆయన టచ్ చేశారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజల ఓట్లు మరే పార్టీకి పడకుండా ఉండే ఎత్తగడలో భాగంగానే కేటీఆర్ అమరావతి సెంటిమెంట్ ప్రస్తావించారని చెప్తున్నారు.