ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకీ ముదురుతోందే తప్ప ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ విముఖంగా ఉన్నారు. అటువైపు నుండి జగన్ క్లారిటీ గా తనవైపు వాదనలు వినిపించేందుకు రెడీగా ఉన్న సమయంలో కేసీఆర్ మాత్రం అసలు ఈ విషయమే పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వమే కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం మేము దీన్ని పరిష్కరిస్తాం అని అంటున్నా కూడా వారి నుండి ఎటువంటి సమాధానం లేదు.
ఇక ఇదే సమయంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం గమనార్హం. తమకు ఏపీ సీఎం జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయని…. అయితే కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తిస్థాయిలో పోరాడతామని చెప్పారు. ట్విట్టర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ సెషన్ ను నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు…. జగన్ ను ఎక్కడ ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. కొంతమంది అయితే కావాలని జగన్ ను టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అయిపోతుంది అని చెప్పినా కేటీఆర్ అందుకు ఏకీభవించారు కానీ అసలు జగన్ పై విమర్శలు కూడా చేసేందుకు అయితే సాహసించలేదు.
అయితే ఇదే సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పిన కేటీఆర్…. నేరుగా జగన్ తో వాదించేందుకు అపెక్స్ కౌన్సిల్ కి మాత్రం వారి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పనే లేదు. అంటే జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగాలి… అవి చెడిపోకుండా తమ పంతం నెగ్గాలి అన్నది కేటీఆర్ ‘స్టైల్ ఆఫ్ పాలిటిక్స్’ లాగా ఉంది. అందుకే జగన్ తో ముఖాముఖి నుంచి తప్పించుకుంటూ… సుప్రీంకోర్టు, కృష్ణా రివర్ బోర్డు అంటూ మధ్యవర్తిత్వాన్ని ఎంచుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం అని అంటున్నారు. మరి ఈ తరహా రాజకీయాలు ఎంతకాలం నిలుస్తాయో అదీ చూద్దాం.