తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నివసించే మెట్రో నగరాల్లో హైదరాబాద్ టాప్లో ఉండే సంగతి తెలిసిందే. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఎందరినో ప్రభావితం చేస్తుంటాయి.
అలాంటి మహానగరంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే, ఈ ఎపిసోడ్లో తాజాగా కీలక పరిణామాలు తెరమీదకు వచ్చాయి.
ఇదేందయ్యా ఇది….
ఎన్నికలంటేనే….కొందరు నేతలు బీరు, బిర్యానీ ఇచ్చో, లేక నోట్లు పంచో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తుంటారు. అయితే ఇప్పుడు రూటు మారింది. కరోనా టైం కదా. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. బీరు, బిర్యానీ కంటే మాస్కులు, శానిటైజర్ల వైపు మొగ్గు చూపుతున్నారట. గ్రేటర్ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు శానిటైజర్లు, మాస్కులను పంచుతున్నారు. ఔను ఇప్పటికే ఈ ప్లాన్ అమలు చేస్తున్నారు.
ఔను ఇదో కొత్త స్కీం….
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల నగరా త్వరలో మోగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిల్చోబోయే అభ్యర్థులు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా నేతలు వాలంటీర్లతో ఇంటింటికీ మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ ట్యాబ్లెట్లు, గుడ్లను పంచుతుండటం విశేషం. మున్సిపల్ ఎన్నికలకు ముందు కనీసం మూడుసార్లు వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారని తెలుస్తోంది. వాలంటీర్లకు గంటకు రూ.100 చొప్పున ఎన్ని గంటలు పని చేస్తే అన్ని వందలు అప్పజెప్పుతున్నారని అంటున్నారు. ఈ కొత్త ట్రెండ్ బీరు, బిర్యానీ కంటే మేలు చేసేదని అంటున్నారు.
ఈ కార్పొరేటర్ గ్రేట్
ఇదిలాఉండగా, సోమాజీగూడా కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదంటూ ఆమె ప్రకటించారు. కార్పొరేటర్ గా ఇచ్చిన హామీలను పూర్తి చేయలేకపోయానని, కాబట్టి తిరిగి ప్రజలను ఓట్లు అడగడం నైతికంగా కరెక్ట్ కాదని.. అందుకే ఇక సెలవు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సంచలన నిర్ణయానికి కారణం కూడా వెల్లడించారు. సోమాజీగూడా అభ్యర్ధిగా పార్టీ ఎవరిని నిర్ణయించినా వారి విజయానికి కృషి చేస్తానని చెప్పానన్నారు
బాధ + వాస్తవం
తన నిర్ణయానికి గల కారణాలను విజయలక్ష్మీ వివరించారు. కార్పొరేటర్గా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడినా నాలుగైదు నెలలు తర్వాత క్రమంగా కోలుకుని అనారోగ్యాన్ని జయించానని ఆమె చెప్పారు. అయితే కార్పొరేటర్ కి ప్రత్యేకంగా ఫండ్ లేకపోవడం, అధికారుల చుట్టూ తిరగలేకపోవడం, సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు సహకరించకపోవడం, ఆరోగ్యం సైతం పూర్తిస్థాయిలో సహకరించలేకపోవడం వల్ల చాలా పనులు చేయలేకపోయానని అన్నారు. చేపట్టాల్సిన పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా.. నిధుల లేమి కారణంగా కొన్ని పనులు ఇంకా అపరిష్కృతంగా మిగిలే ఉన్నాయంటూ ఆమె వివరించారు. అందుకే తాను మళ్లీ కార్పొరేటర్ గా పోటీ చేయబోవడం లేదని తమ నాయకుడు కేటీఆర్ గారికి ఇటీవల కలిసిన సందర్భంలో తన అభిప్రాయాన్ని తెలియజేశానని విజయలక్ష్మీ మీడియాకు తెలిపారు.