ద హేగ్: పాక్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం రేపటి నుండి విచారణ ప్రారంభించనుంది.
గూఢచర్యం ఆరోపణతో 2016లో జాదవ్ను బులూచిస్థాన్ ప్రావిన్స్లో పాక్ భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 2017 ఏప్రిల్లో పాకిస్థాన్ మిలటరీ కోర్టు జాదవ్కు మరణశిక్ష విధించింది. ఇరాన్లో ఉంటున్న జాదవ్ను పాకిస్థాన్ కిడ్నాప్ చేసిందని భారత్ నాడు ఆరోపించింది. పాక్ విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. జాదవ్ ప్రస్తుతం పాక్ జైలులో ఖైదీగా ఉన్నాడు.
ద హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)లో ఫిబ్రవరి 18 నుండి 21వరకూ కేసు విచారణ జరగనుంది. భారత్, పాక్ తమ వాదనలు వినిపించనున్నాయి. భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సోమవారం తన వాదనలను వినిపించనున్నారు. పాకిస్థాన్ తరపున ఇంగ్లిష్ క్వీన్ కౌన్సిల్ ఖవార్ ఖురేషీ ఈ నెల 19న వాదనలు వినిపిస్తారు. తరువాత ఫిబ్రవరి 20న భారత్, 21న పాకిస్థాన్ ప్రతిపాదనలు సమర్పించనున్నారు.
ఈ కేసు విచారణను ఐక్యరాజ్యసమితి ఆన్లైన్లో టెలివిజన్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ ఏడాది వేసవిలో జాదవ్ కేసుపై అంతర్జాతీయ న్యాయస్థానం తుది తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంతో భారత్, పాకిస్థాన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాయాది దేశానికి తగిన గుణ పాఠం చెప్పేందుకు భారత్ చర్యలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో పాకిస్థాన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కులభూషణ్ జాదవ్ కేసు మళ్లీ తెరపైకి రావడం ప్రాధాన్యతను సంచరించుకుంది.