ప్రయాగ్రాజ్, జనవరి 15 : ఉత్తర ప్రధేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా మకర సంక్రాంతి పర్వదినం రోజు మంగళవారం ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 5.15 గంటలకు మొదటి రాజయోగ స్నానాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
పవిత్ర ఘడియల్లో త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయన్న నమ్మకంతో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రపంచ నలుమూలల నుంచి యాత్రికులు తరలివచ్చారు.
విదేశీయులు కూడా అధిక సంఖ్యలో కుంభమేళకు హజరయ్యారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విధానాలకు ఆకర్షితులైన కొందరు విదేశీయులు అర్ధ కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించారు.
కుంభమేళా ప్రతీ 12 సంవత్సరాలకు ఒక సారి వస్తుంది. సూర్యుడు, గురుడు కదలికల ఆధారంగా కుంభమేళా ప్రాంతం నిర్ణయమవుతుంది. ఈ మధ్యలో ఆరు సంవత్సరాలకు ఒక సారి జరిగే అర్ధ కుంభమేళా ప్రయాగలో 2013లో కుంభ్ జరిగింది.
మళ్లీ ఇప్పుడు 2019లో అర్ధ కుంభ్ జరుగుతోంది. దీనికి ఖగోళ గ్రహగతులతో సంబంధం లేదు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైన ఈ అర్ధ కుంభమేళా మార్చి 4 శివరాత్రి వరకు కొనసాగనుంది.
50 రోజుల పాటు సాగే ఈ క్రతువులో 12కోట్ల మంది వరకు పాల్గొంటారని అంచనా. అర్ధ కుంభ మేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేపట్టాయి.
15 రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, 28 కేంద్ర్ ప్రభుత్వ విభాగాలు, ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ అర్థ కుంభ మేళాను పర్యవేక్షిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 4,200కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
గంగ, యమున, సరస్వతి నదీ తీరాన 32వేల హెక్టార్లలో ఏర్పాట్లు చేసిన కుంభ్ నగరి ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక నగరంగా రికార్డుకెక్కింది. 250 కిలో మీటర్ల పొడవైన రోడ్లు, 20 వంతెనలు, ఆస్పత్రులు, పోలీస్స్టేషన్లు, బ్యాంకులు ఇలా అన్నీ మౌలిక సదుపాయాలను ఒకే చోట కల్పించారు.
కేంద్ర మంత్రి హర్షవర్థన్ నిన్న అర్థ కుంభమేళా కోసం ప్రత్యేకంగా నాలుగు
ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లను ప్రారంభించారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు ప్రజలు తెలుసుకునే విధంగా ‘ కుంభమేళా వెదర్’ పేరుతో మెబైల్ యాప్ సర్వీసు సైతం రూపొందించారు.
వీఐపీల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.