Lagadapati Rajagopal: పారిశ్రామిక వేత్త నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన లగడపాటి రాజగోపాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు అంటూ ఎవరూ ఉందరు. కాకపోతే రాష్ట్ర విభజన అనంతరం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన రాజగోపాల్.. ఆ మేరకు చేసిన శపథం ప్రకారం రాజకీయాలకు దూరమైయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కొంత కాలం రాజకీయ సర్వేలు నిర్వహించి ఎగ్జిట్ ఫోల్స్ ప్రకటించారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన వెల్లడించిన ఫలితాలు తారు మారు అయ్యాయి. దాంతో అంతకు ముందు ఆయన సర్వేలపై ఉన్న విశ్వసనీయత పూర్తిగా కనుమరుగైంది. అయితే ఇప్పుడు ఆయన విషయం ఎందుకు అంటే ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో ఆయన పేరు ప్రముఖంగా వినబడుతోంది.
Lagadapati Rajagopal: విజయవాడ లేదా గుంటూరు నుండి
వచ్చే ఎన్నికల్లో రాజగోపాల్ పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. లగడపాటి టీడీపీ నుండి పోటీ చేయడానికి సిద్దమైతే విజయవాడ లేదా గుంటూరు పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక అభ్యర్ధిత్వం ఖరారు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. విజయవాడ నుండి కేశినేని నాని, గుంటూరు నుండి గల్లా జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు. రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరు పార్లమెంట్ నుండి కాకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారని తెలుస్తోంది. దీంతో లగడపాటి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
చంద్రగిరి అసెంబ్లీకి గల్లా జయదేవ్..?
గల్లా జయదేవ్ ను చంద్రబాబు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇక కేశినేని నాని పార్లమెంట్ కే పోటీ చేయాలని భావిస్తే ఆయనను గుంటూరుకు పంపి లగడపాటికి విజయవాడ టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా విజయవాడ, గుంటూరు పార్లమెంట్ స్థానాలు టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో లగడపాటి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ నుండి పోటీ చేసినా గెలుపు సులువే అన్న భావన ఆ పార్టీలో ఉంది. అయితే ఇంత వరకూ లగడపాటి గానీ, టీడీపీ గానీ ఈ విషయంపై అధికారికంగా ఏమీ ప్రకటన చేయలేదు. కొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.