Lakhimpur Kheri: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా తేని బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడైన ఆశిష్ మిశ్రా తేనికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అశిష్ మిశ్రా కు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ జరిపింది. కేసు విచారణ సందర్భంలో పిటిషనర్ జగ్జిత్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అలహాబాద్ హైకోర్టు ఇంత హడావిడిగా ఈ బెయిల్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని దుష్యంత్ దవే ప్రశ్నించారు. సీఆర్పీసీ 161 కింద 22 సాక్షులను సిట్ పరిశీలించి, 164 సీఆర్పీసి కింద 19 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేసిందని, ఇంత విస్తృతంగా సిట్ చేసిన దర్యాప్తును హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.
Lakhimpur Kheri: సాక్షులకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్న యూపి ప్రభుత్వం
అశిష్ మిశ్రా, తదితురలపై ఉన్న అభియోగాల తీవ్రత దృష్ట్యా వారికి బెయిల్ మంజూరు చేయడానికి తమ ప్రభుత్వం వ్యతిరేకించిన విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ ధర్మాసనానికి తెలియజేశారు. నిందితుడు ఆశిష్ మిశ్రా తరఫు అడ్వకేట్ రంజిత్ సింగ్ తన వాదన వినిపిస్తూ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రద్దు చేస్తే తాను కానీ, ఏ కోర్టు కానీ చేయగలిగేది ఏమీ ఉండదని అన్నారు. ఆశిష్ మిశ్రాకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ రెండు పర్యాయాలు సిఫార్సు చేసినట్టు కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ధర్మాసనానికి విన్నవించింది. కేసు దర్యాప్తులో ఉన్నందున సాక్షులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఆ కారణంగా నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని యూపీ హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి సిట్ గత ఫిబ్రవరి 10,14 తేదీల్లో లేఖలు రాసిందని వివరించారు. కాగా ఈ కేసుకు సంబంధించిన సాక్షులందరికీ పూర్తి రక్షణ కల్పిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు యోగి సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. సాక్షులకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయో లేదో చూసేందుకు యూపీ ప్రభుత్వం వారందరితో ఫోన్తో పాటు వ్యక్తి గత స్థాయిలో మాట్లాడుతుందని పేర్కొన్నారు. అన్ని వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు కేసులో నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
కాగా, గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు రైతులు నిరసనలు చేయడంతో వారిపై నుంచి అశిష్ మిశ్రా వేగంగా వాహనం నడపడంతో ఎనిమిది మంది చనిపోయారు.