Lance Naik Sai Teja Final Rites: తమిళనాడులో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ కూడా మరణించిన సంగతి తెలిసిందే. త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తూ ఆయనతో పాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో సాయి తేజ కూడా కన్నుమూశారు. కాగా సైనికాధికారులు ఆదివారం బెంగళూరు నుండి సాయితేజ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన ఎగువరేగడకు తీసుకువచ్చారు. ఎగువ రేగడలోని వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో సాయి తేజ అంత్యక్రియలు నిర్వహించారు. సాయితేజ అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చి కన్నీటితో వీడ్కోలు పలికారు. పొరుగు గ్రామాల ప్రజలు కూడా ఎగువరేగడకు పోటెత్తారు.
Lance Naik Sai Teja Final Rites: సాయితేజకు కన్నీటి వీడ్కోలు
సాయితేజ అమర్ రహే, జై జవాన్, భారత్ మాతాకీ జై నినాదాలతో ఎగువరేగడ మారుమోగింది. అక్కడకు వచ్చిన వేలాది మంది సాయితేజకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. తొలుత సాయి తేజ భౌతికకాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సాయి తేజ మృతదేహాన్ని చూసి అతని భార్య శ్యామల గుండెలవిసేలా రోధించారు. దీంతో ఆమె సొమ్మ సిల్లి పడిపోయారు. సాయితేజ తల్లిదండ్రులు కూడా బోరుబోరున విలపించారు., వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
2013లో ఆర్మీలో సిపాయిగా చేరిన సాయి తేజ అంచలంచెలుగా ఎదిగారు. అంకితభావంతో విధుల నిర్వహించడంతో బిపిన్ రావత్ మనసు గెలుచుకున్నారు. దీంతో ఆయన తన భద్రతా దళంలోకి తీసుకున్నారు. తానుంత వరకూ తనతోనే ఉండాలని జనరల్ బిపిన్ రావత్ చెప్పేంత ఉన్నత స్థాయికి సాయి తేజ ఎదిగాడు. చివరకు ఆయనతో కలిసే లోకాన్ని వీడాడు సాయితేజ. సాయితేజ పార్ధీవ దేహం పై కప్పిన జాతీయ పతకాన్ని అతని భార్య శ్యామలకు అందించారు ఆర్మీ అధికారులు.