తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురై దేశం వదిలి విదేశాలకు పరారైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి ద్వీపదేశంలో అడుగుపెట్టారు. దాదాపు ఏడు వారాల తర్వాత సొంత గడ్డపై ఆయన కాలుమోపారు. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశానికి తిరిగి వచ్చినట్లు కొలంబో విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. స్వదేశానికి వచ్చిన గొటబాయ రాజపక్సకు కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు స్వాగతం పలికారని ఆయన వెల్లడించారు. గొటబాయకు భద్రత కల్పించేందుకు లంక ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి.
దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి రాజపక్స కుటుంబమే కారణం అంటూ నెలల తరబడి శ్రీలంక ప్రజలు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. నిరసనకారులు గొటబాయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టడంతో జూలై రెండోవారంలో మల్దీవులకు పరారైయ్యారు. అక్కడ నుండి సింగపూర్ వెళ్లారు. దేశం వదిలి వెళ్లిన తర్వాత రాజపక్స తన రాజీనామాను పంపారు. అనంతరం ఆయన సింగపూర్ నుండి థాయ్ లాండ్ వెళ్లారు. థాయ్ లాండ్ లో 90 రోజులు ఉండటానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
శ్రీలంక సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు .. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులకు ట్రావెల్ బ్యాన్
థాయ్ లాండ్ నుండి యూఎస్ వెళతారని ప్రచారం జరిగినప్పటికీ త్వరలో స్వదేశానికి తిరిగి వస్తాయని గొటబాయ రాజపక్స బంధువు మీడియాకు తెలిపారు. ఈ తరుణంలోనే స్వదేశానికి తిరిగి రావడానికి వీలుకల్పించాలని అధ్యక్షుడుగా ఎన్నికైన రణిల్ విక్రమ్ సింఘేని రాజపక్స అభ్యర్ధించారు. గొటబాయ విజ్ఞప్తి పై ప్రభుత్వం సానుకూల స్పందన రావడంతో స్వదేశానికి రావడానికి రాజపక్స నిర్ణయించుకున్నారు. బ్యాంకాక్ నుండి సింగపూర్ మీదుగా వాణిజ్య విమానంలో శ్రీలంక కు చేరుకుని 52 రోజుల స్వీయ ప్రవాసాన్ని ముగించారు గొటబాయ రాజపక్స.
థాయ్ లాండ్ కు మకాం మార్చుకుంటున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స