శ్రీలంకలో నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ రోజు ఉదయం అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష నివాసాన్ని ముట్టడించిన పెద్ద సంఖ్యలో నిరసనకారుల భద్రత బలగాలను దాటుకొని అధ్యక్షుడు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ పరిణామానికి ముందే ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ ను రక్షణ సిబ్బంది ఆర్మీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. పోలీసుల ఆందోళన కారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు కానిస్టేబుల్స్ సహా 30మంది గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని రాణిల్ విక్రమ సింగే తన పదవికి రాజీనామా ప్రకటించారు.
కాగా శనివారం రాత్రి నిరసనకారులు ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. ప్రధాని నివాస ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయడానికి అంగీకరించారు. వచ్చే బుధవారం (13వ తేదీ) అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. నెల రోజుల పాటు స్పీకర్ రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ లోపుగా పార్లమెంట్ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది.
శ్రీలంకలో ఆర్ధిక ఆహార సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఈ పరిస్థితికి అధ్యక్షుడు గొటబాయ కారణం అంటూ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రజాగ్రహానికి పదవి నుండి తప్పుకోవడాని సిద్దమయ్యారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.