రెండు రోజుల క్రితం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెల్సిందే. ఈ అగ్నిప్రమాదంలో 9 మంది మరణించగా 8 మంది తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించిన వారి ఆఖరి మాటలు ఉన్న ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది.
“మనం లోపలుంటే ఇక అయిపోతామబ్బా”, “కష్టం.. ఇక అయిపోయింది మన పని” అన్న మాటలు ఆ వీడియోలో వినిపించాయి. మొత్తం ప్లాంట్ అంతా అప్పటికే దట్టమైన పొగ ఆవహించేసింది. మరణించిన 9 మంది ప్లాంట్ ను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఎలాగైనా ప్లాంట్ ను రక్షించడానికి మంటలు ఆర్పడానికి తెగ ప్రయత్నించారు. అయితే అది వాళ్ళ వల్ల కాకపోవడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు ప్లాంట్ మొత్తం వ్యాపించేసాయి. వీరి మృత దేహాలు 5 ఫ్లోర్స్ లోనూ ఉండడంతో వీరు ఎంతలా తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించారో అర్ధమవుతోంది.