తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొద్దికాలంగా రాజకీయాల కంటే, సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు పార్టీ పరంగా కార్యక్రమాలు చూసుకుంటున్నందున బాలకృష్ణ పెద్దగా పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టడం లేదు. అయితే, ఆయన్ను మాత్రం అధికార వైసీపీ టార్గెట్ చేస్తోందని టీడీపీ అభిమానులే చర్చించుకుంటున్న పరిస్థితి. వరుసగా జరుగుతున్న సంఘటనలు దీనికి నిదర్శమని అంటున్నారు.
మళ్లీ తెరకెక్కిన గీతం
బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మరిన్ని సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు. విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంజనీరింగ్ కళాశాల భవనాలను నిర్మించడంతో పాటు వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసీటీఈ నుంచి అనుమతులు సంపాదించిందని, తద్వారా ఏఐసీటీఈ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లు పలు పత్రికలో వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో నిజాల నిగ్గు తేల్చేందుకు తక్షణమే గీతం నియమాల ఉల్లంఘనలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్దేకు లేఖ రాశారు.
విజయసాయిరెడ్డి వదిలిపెట్టట్లేదుగా
గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాల నిర్మాణం, వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో ఏటా పెంచుతూ పోతున్న సెక్షన్లకు సంబంధించి ఏఐసీటీఈ ఆమోదం పొందే విషయంలో పాల్పడిన వివిధ నియయాల ఉల్లంఘనలను విజయసాయి రెడ్డి తన లేఖలో సోదాహరణంగా వివరించారు. ఏఐసీటీఈ నియమ నిబంధనలను అతిక్రమిస్తూ గీతం విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించి అందులో మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన భవనాలను నిర్మించిందని ఆయన ఆరోపించారు. “ఆ భవనాలు ప్రభుత్వానికి చెందిన ఆక్రమిత భూమిలో నిర్మించిన విషయాన్ని దాచిపెట్టి గీతం ఏఐసీటీఐ నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు అనుమతులు సంపాదించింది. తద్వారా ఏఐసీటీఈని గీతం యాజమాన్యం తప్పుదారి పట్టించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా కేటగిరీ 1 గ్రేడ్తో స్వయంప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థ హోదాను దక్కించుకున్న గీతం ఇలాంటి దురాక్రమణలకు పాల్పడి ప్రభుత్వ భూముల్లో అకడమిక్ భవనాలు నిర్మించడం అత్యంత శోచనీయం` అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
భూమి పేరుతో….
గీతం అధీనంలో ఉన్న కొంత భూమికి సంబంధించి యాజమాన్య హక్కులపై వివాదం నెలకొని ఉందని విజయసాయిరెడ్డి వివరించారు. “ప్రభుత్వానికి చెందిన భూమిలో మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన భవనాలను నిర్మించిన గీతం విద్యా సంస్థ అడ్డదారుల్లో, మోసపూరితంగా సంబంధింత అధికారుల నుంచి భూ వినియోగం, భవనాల ప్లాన్లకు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించగా 40 ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమిని గీతం సంస్థ ఆక్రమించినట్లుగా నిర్ధారణ అయింది. ఆక్రమించిన భూమిపై స్వాధీన హక్కులు పొందేందుకు గడచిన కొన్నేళ్ళుగా గీతం యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ 40 ఎకరాల 50 సెంట్ల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం గీతం విద్యా సంస్థలకు ఎలాంటి స్వాధీన హక్కులను ఇవ్వలేదు. అలాగే ఆక్రమిత భూమిని గీతంకు కనీసం లీజుకు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విభాగానికి చెందిన వెబ్సైట్లో తనిఖీ చేసి ఏఐసీటీఈ ఈ వాస్తవాలను ధృవీకరించుకోవచ్చు` అని ఆయన తెలిపారు.
వెంటనే విచారణ
తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసీటీఈ అనుమతులుటెక్నికల్ కోర్సులు ఆఫర్ చేస్తున్నకొన్ని భవనాలు గీతం యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో నిర్మించినవేనని విజయసాయిరెడ్డి తెలిపారు. “ఏఐసీటీఈ అనుమతుల కోసం సమర్పించిన అఫిడవిట్లో ఈ వాస్తవాలను ఆ విద్యా సంస్థ యాజమాన్యం దాచి పెట్టింది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసీటీఈ అనుమతులు సంపాదించి ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహిస్తోంది` అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. భూమి అవసరాలకు సంబంధించి ఏఐసీటీఐ నియమ నిబంధనలకు అనుగుణంగా గీతం చర్యలు లేనందున ఇంజనీరింగ్ కోర్సుల ఆమోదం కోసం ఆ విద్యా సంస్థ గతంలో సమర్పించిన తప్పుడు అఫిడవిట్పై విచారణ జరిపి కొన్నిఇంజనీరింగ్ విభాగాల భవనాలు నిర్మించిన భూమి వివాదారహితమైనదో కాదో నిర్ధారించేందుకు తక్షణమే ఏఐసీటీఈ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.