ఏలూరులో వింత వ్యాధి జనాలను ఓ రేంజ్లో షాక్కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో దాదాపు 600 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం వింత వ్యాధులకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారు . తాజాగా వారిని మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి టూర్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాదయాత్ర .. ప్రత్యక్ష ఆదేశాలు
మంత్రి ఆళ్ల నాని తూర్పు వీధి లో పలు వీధుల్లో పాదయాత్ర చేస్తూ డ్రైన్, మురికి గుంటలను పరిశీలించారు. ఎక్కడా మురికి నీరు నిల్వవుండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మంత్రి ఆళ్ల నాని దృష్టికి పలు సమస్య తీసుకురాగా వాటి పరిస్కారానికి అధికారులకు నేరుగా ఆదేశాలు ఇచ్చారు. అందుబాటులో లేని అధికారుల కు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. ఎప్పుడైనా తనను స్వయంగా కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చునని, ప్రజా సమస్యల పరిస్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ఆళ్ళ నాని చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్య మని తెలిపారు.
వాళ్లతో మంత్రి ఏం మాట్లాడారంటే….
ఈ సందర్భంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారితో మంత్రి మాట్లాడారు. ఆరోగ్యం ఎప్పటి లాగానే నిలకడగా, సాధారణంగా ఉంటోందని చాలా మంది చెప్పగా, కొంతమంది మాత్రం కొద్దిపాటి నీరసంగా ఉంటోందని మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు. వింత వ్యాధి బాధితులకు మందుల కిట్ తో పాటు మంత్రి ఆళ్ల నాని స్వంత ఖర్చుతో స్వయంగా ఏర్పాటు చేసిన బియ్యం, నూనె, పప్పులు, కూరగాయలు, మాస్క్ తో కూడిన కిట్ లను కూడా అందచేశారు. 5 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ దొండకాయలు, కేజీ ఆనబకాయ, కేజీ దోస, కొత్తిమీర, మాస్క్ తో పాటు పారాసిటమాల్, సిట్రజన్, విటమిన్ సి, విటమిన్ బి, ఓ ఆర్ ఎస్ వంటి మందులను అందచేశారు. వైద్యులు సూచనల మేరకు మందులు వాడాలని, సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా , పూర్తిగా కొలుకొనేంతవరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలని ఆళ్ల నాని సూచించారు. వింతవ్యాధుల కు సంబంధించిన కేసులు ప్రస్తుతం ఏ ఒక్కటీ లేదని, పూర్తిగా అదుపులో ఉందన్నారు.