తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య సఖ్యత రాజకీయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక్క నీటి వివాదాలు తప్ప ఈ ఇద్దరు సీఎంల మధ్య విబేధాలు లేవు!
ఈ రాజకీయ దోస్తీ విషయంలో తాజాగా తెలంగాణ సీఎం అనుసరిస్తున్న ఓ వైఖరిని తాను కూడా ఫాలో అవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చేదిగా ఉండనున్నట్లు చెప్తున్నారు. ఇది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి.
ఈ రచ్చ ఈనాటిది కాదు
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పెద్ద పంచాయతే నడుస్తున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాలు మొండిపట్టు పట్టడంతో ఈ పోరు ఊహించని సస్పెన్లకు వేదికగా మారుతోంది. ఇటీవలే ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరపాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే, ఈ పోరు పట్ల అంతగా ఆసక్తి లేని జగన్ సర్కారు కొత్త గేమ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
జగన్ సర్కారు నిర్ణయమే ఫైనల్
ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై పూర్తి అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. రాజ్యాంగంలోనూ ఇదే ఉంది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే, పంచాయతీ ఎన్నికలు తమ సమ్మతం ప్రకారమే నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇందుకు తగు రీతిలో ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు.. ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకునే విధంగా చట్టంలో మార్పులు తీసుకురాబోతోంది.
కేసీఆర్ ను కాపీ కొట్టేదామంటున్న జగన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దికాలం క్రితం పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం ప్రకారమే స్థానిక ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించాలి. కానీ, ఏపీలో మాత్రం అలాంటి వెసులుబాటు లేదు. అందుకే, జగన్ ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని ఉదాహరణగా తీసుకుంటోంది. ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ఓ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటోంది. అయితే, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో చేసిన మార్పులు రాజ్యాంగపరంగా, న్యాయపరంగా చెల్లవని కొందరు కోర్టుకు వెళ్లారు. ఏపీలో తీసుకొచ్చే ఆర్డినెన్స్ విషయంలోనూ ఇలాగే జరగనుందా? అనేది కాలమే చెప్పాలి.