తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఆ సీటును కైవసం చేసుకోవడం బీజేపీలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఆ పార్టీ వ్యూహాలు మారిపోనున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలోనే ఆ పార్టీ నేతలు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ పోరుపై ఆసక్తికర కామెంట్లు చేశారు.
గ్రేటర్ సర్వేలో ఏం వచ్చిందంటే…
విలేకరుల సమావేశంలో మాట్లాడిన సంజయ్ దీపావళికి బీజేపీని గెలిపించిన దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ ఇచ్చారని GHMC ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సంక్రాంతికి మరో గిఫ్ట్ ఇస్తారని అన్నానారు. 2023లో గోల్కొండ కోటలో కాషాయ జెండా ఎగరవేస్తామన్నారు. దుబ్బాక ఫలితాలతో బీజేపీకి మరింత భాద్యత పెరిగిందన్నారు. దుబ్బాక ఎన్నికల కంటే ముందు జీహెచ్ఎంసీలో సర్వే చేస్తే 75 సీట్ల కంటే ఎక్కువ బీజేపీకి వస్తాయని తేలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఓల్డ్ సిటీలో పన్నులు వసూలు చేస్తున్నారా? లేదా అనేదానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నిరుద్యోగ భృతిని ప్రకటించాలన్నారు. హైదరాబాద్ లో నాళాలు- చెరువు కబ్జాలు ఎవరు చేశారో ప్రభుత్వం బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
100 సీట్లు బీజేపీ ఖాతాలోకే…
మరో సమావేశంలో కూడా బండి సంజయ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. దుబ్బాక బై ఎలక్షన్ ఫలితం నుండి తెలంగాణకు మహర్దశ ప్రారంభమైందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బకలో ఇచ్చిన తీర్పే గ్రేటర్ ఎన్నికల్లో ఇవ్వాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతోందన్నారు. దుబ్బాక ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారని..తెలంగాణ గడ్డతో పాటు మొన్న జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందన్నారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసమే కేసీఆర్ యాగాలు చేస్తున్నాడని…బీసీలంతా టీఆరెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.అబద్దాలు చెప్పే సీఎం ఈ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు.